రెబల్ ఎమ్మెల్యేలకు ట్రబుల్, సీఎం షాక్, శాఖలు మంత్రులకు, గోవిందా గోవిందా !
బెంగళూరు: కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలి బీజేపీ అధికారంలో రావడానికి కారణం అయిన అనర్హత ఎమ్మెల్యేలకు కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప షాక్ ఇచ్చారు. ఇంత కాలం మంత్రి పదవులు వస్తాయని ఆశగా ఉన్న అనర్హత ఎమ్మెల్యేలు ఆ మంత్రి పదవుల శాఖలు వేరే వారికి అప్పగించడంతో ఆందోళనకు గురైనారు. కోర్టు విచారణ ఎప్పుడు పూర్తి అవుతుందో ?, ఎప్పుడు మా ఆశ తీరుతుందా ? ఎప్పుడు మంత్రులు అవుతామో దేవుడా అంటూ బిక్కముఖం వేశారు.
రేప్ కేసులో బీజేపీ ఎమ్మెల్యే: విచారణ చెయ్యాలి, కోర్టు ఆదేశం, రూ. 50 లక్షలు !
మంత్రి పదవులతో ఇంటికి
బీఎస్. యడియూరప్ప సీఎం అయితే మంత్రివర్గంలో చోటు సంపాధించుకుని సొంత నియోజక వర్గాలకు దర్జాగా వెళ్లాలని, తరువాత ఇంటిలో హాయిగా ఉండాలని రెబల్ ఎమ్మెల్యేలు ఆశపడ్డారు. అయితే రెబల్ ఎమ్మెల్యేల మీద అప్పటి స్పీకర్ రమేష్ కుమార్ వేటు వెయ్యడంతో అనర్హత ఎమ్మెల్యేలు అయ్యారు.
సీఎం షాక్
సీఎం యడియూరప్ప ఆయన మంత్రి వర్గంలో 17 మంది అనర్హత ఎమ్మెల్యేల కోసం కొన్ని మంత్రి పదవులు పక్కనపెట్టారు. అనర్హత ఎమ్మెల్యేల కోసం మరో విడత మంత్రివర్గం విస్తరించాలని సీఎం నిర్ణయించారు. అయితే అనర్హత ఎమ్మెల్యేల కోసం పక్కనపెట్టిన శాఖలను ఇప్పుడు కొందరు సీనియర్ మంత్రులకు సీఎం యడియూరప్ప అప్పగించి అనర్హత ఎమ్మెల్యేలకు పెద్ద షాక్ ఇచ్చారు.
ఎప్పుడు పూర్తి అవుతుందో ?
కాంగ్రెస్ కు చెందిన 14 మంది ఎమ్మెల్యేలు, జేడీఎస్ కు చెందిన 3 ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు పడింది. సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయి బీజేపీ అధికారంలోకి రావడానికి ఈ 17 మంది ఎమ్మెల్యేలు పని చేశారు. మంత్రులు అవుతాం అనుకుంటున్న సమయంలోనే 17 మంది మీద అనర్హత వేటు పడింది. అనర్హత ఎమ్మెల్యేల అర్జీ విచారణ సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉంది. సుప్రీం కోర్టులో మా అర్జీ విచారణ ఎప్పుడు పూర్తి అవుతోందో అని కొందరు రెబల్ ఎమ్మెల్యేలు వాపోతున్నారు.
ఉప ఎన్నికలు వాయిదా !
అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్యేల నియోజక వర్గాల్లో అక్టోబర్ 21వ తేదీ జరగవలసిన ఉప ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇంతలోనే డిసెంబర్ 5వ తేదీ ఉప ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల అధికారులు తెలిపారు. ఇంకా నెల రోజుల పాటు అనర్హత ఎమ్మెల్యేలు యడియూరప్ప ప్రభుత్వంలో మంత్రులు కావడానికి అవకాశం లేదు.
మంత్రి పదవులు ఎప్పుడు ?
ఇప్పటికే మంత్రి పదవులు రాలేదని కొందరు బీజేపీ ఎమ్మెల్యేలు అసహనంగా ఉన్నారు. అనర్హత ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చే సమయంలో మాకు మంత్రి పదవులు వస్తాయని కొందరు ఆశగా ఎదురు చూశారు. అయితే ఇప్పుడే మంత్రివర్గ విస్తరణ లేదని తేలిపోవడంతో బీజేపీలోని కొందరు ఎమ్మెల్యేలు హైకమాండ్ మీద కస్సుబస్సు అంటున్నారు. అనర్హత ఎమ్మెల్యేల కోసం ఎదురు చూడటం ఏమిటి, మాకు ఇప్పుడు మంత్రి పదవులు ఇస్తే ఏమౌతుంది అని యడియూరప్ప దగ్గర వాపోతున్నారని తెలిసింది.