రాహుల్గాంధీకి పౌరసత్వ కష్టాలు...నోటీసులు జారీ చేసిన కేంద్ర హోంశాఖ
Recommended Video
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఎన్నికల వేళ కష్టాలు ఎదురవుతున్నాయి. గత కొద్ది రోజులుగా ఆయన పౌరసత్వంపై సందిగ్ధత నెలకొంది. ఇప్పటికే రాహుల్ గాంధీ పౌరసత్వంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అమేథీ బరిలో నిల్చున్న స్వతంత్ర అభ్యర్థి రాహుల్ నామినేషన్పై అభ్యతరం వ్యక్తం చేయడంలో అసలు సంగతి వెలుగు చూసింది. ఆయన అభ్యంతరాలను ఫిర్యాదు రూపంలో బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యన్ స్వామి కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన కేంద్ర హోంశాఖ ఎలా రియాక్ట్ అయ్యింది...? స్వామి తన ఫిర్యాదులో ఏమి పేర్కొన్నారు..? ఇది రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగమేనా..?
రాహుల్కు కేంద్రహోంశాఖ నోటీసులు
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి పౌరసత్వ చిక్కులు వీడటం లేదు. తాజాగా ఆయన పౌరసత్వంపై వచ్చిన ఫిర్యాదుల మేరకు వివరణ ఇవ్వాలంటూ కేంద్ర హోంశాఖ కార్యాలయం రాహుల్ గాంధీకి నోటీసులు జారీ చేసింది. బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యన్ స్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాహుల్కు నోటీసులు పంపడం జరిగింది. రాహుల్ గాంధీకి బ్రిటీషు పౌరసత్వం ఉందని స్వామి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కేంద్రహోంశాఖ కార్యాలయం నోటీసులో పేర్కొంది. అమేథీ నియోజకవర్గం నుంచి బరిలో దిగుతున్న రాహుల్ గాంధీ తన నామినేషన్ ఇప్పటికే దాఖలు చేశారు. అయితే నామినేషన్ పత్రాల వెరిఫికేషన్ను వాయిదా వేశారు రిటర్నింగ్ అధికారి. ధృవ్ లాల్ అనే స్వతంత్ర అభ్యర్థి రాహుల్ పౌరసత్వంపై అనుమానాలు లేవనెత్తడంతో ఆయన నామినేషన్ స్క్రూటినీ వాయిదా వేశారు. నామినేషన్ సందర్భంగా డాక్యుమెంట్లలో తన పౌరసత్వంపై రాహుల్ ఇచ్చిన వివరణ సరిగ్గా లేదంటూ ఫిర్యాదు చేశారు ధృవ్లాల్.
రాహుల్ గాంధీ ఎలా సమర్థించుకుంటారు..?
రాహుల్ గాంధీ పౌరసత్వంపై అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. రాహుల్ గాంధీ లేదా కాంగ్రెస్ వారు ఇప్పటి వరకు తన పౌరసత్వంకు సంబంధించి వివరణ ఇవ్వకపోవడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. యూకేలో ఓ కంపెనీలో రాహుల్ గాంధీ బ్రిటీష్ పౌరుడిగా నమోదై ఉందని జీవీఎల్ నరసింహారావు చెప్పారు. ఇదే విషయాన్ని పొందుపరుస్తూ సుబ్రహ్మణ్యన్ స్వామి కేంద్రహోంశాఖకు ఫిర్యాదు చేశారు. యూకే కంపెనీలో రాహుల్ గాంధీ బ్రిటీష్ పౌరుడిగా ఉందంటే అది సామాన్యమైన విషయం కాదని అక్కడ పౌరసత్వం ఉంటేనే ఆ కంపెనీ బ్రిటీష్ పౌరుడని పేర్కొన్నదని స్పష్టం చేశారు జీవీఎల్.
రాహుల్ పౌరసత్వం ఇలా వెలుగులోకి వచ్చింది
యునైటెడ్ కింగ్డమ్లో 2003వ సంవత్సరంలో బ్యాకాప్స్ లిమిటెడ్ అనే కంపెనీ రిజిస్టర్ అయ్యింది. 51 సౌత్ గేట్ స్ట్రీమ్ విన్చిస్టర్, హ్యాంప్షైర్ S023 9EK చిరునామాతో రిజిస్టర్ అయ్యింది. అందులోని డైరెక్టర్లలో రాహుల్ గాంధీ ఒకరు. ఆ కంపెనీకి సెక్రటరీగా కూడా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు ఆ కంపెనీ 10 అక్టోబర్ 2005, 31 అక్టోబర్ 2006లో ఐటీ రిటర్న్స్ దాఖలు చేయగా అందులో పుట్టిన తేదీ 19/06/1970గా ఉందని, బ్రిటీష్ పౌరుడిగా డిక్లేర్ చేసినట్లు అందులో ఉందని రాహుల్ గాంధీకి పంపిన నోటీసుల్లో కేంద్రహోంశాఖ పొందుపర్చింది. నోటీసులు అందిన నాటి నుంచి 15 రోజుల్లోగా సమాధానం ఇవ్వాల్సిందిగా రాహుల్ను ఆదేశించింది కేంద్రం హోంశాఖ.
రాహుల్ నామినేషన్లో తప్పుడు సమాచారం: ధృవ్లాల్
ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ తన నామినేషన్ పత్రాల్లో అంతా తప్పుడు సమాచారంను పొందుపర్చారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు స్వతంత్ర అభ్యర్థి ధృవ్ లాల్. విద్యార్హతలు, గుర్తింపు, పౌరసత్వం, యూకేలో ఆస్తులు, తను ఆర్జించిన లాభాలు ఇలా చాలావాటిపై రాహుల్ గాంధీ తప్పుడు సమాచారం ఇచ్చారని ధృవ్లాల్ ఫిర్యాదు చేశారు. ఇక ఏప్రిల్ 5వ తేదీన వాయనాడ్ లోక్సభ స్థానానికి రాహుల్ గాంధీ నామినేషన్ దాఖలు చేయగా... ఏప్రిల్ 10వ తేదీన అమేథీ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు.