TRP fraud busted: అర్నబ్ గోస్వామిని ప్రశ్నించనున్న ముంబై పోలీసులు
ముంబై: టీఆర్పీ రేటింగ్ కుంభకోణాన్ని ముంబై పోలీసులు బయటపెట్టారు. టీఆర్పీల విషయంలో కొన్ని ఛానళ్లు మోసాలు చేస్తున్నాయని ముంబై పోలీస్ కమిషనర్ పరమ్ వీర్ సింగ్ తెలిపారు. కొందరికి డబ్బులు ఇచ్చి వాళ్ల ఛానెళ్లు చూసేలా చేస్తున్నాయని వెల్లడించారు. ఈ వ్యవహారానికి సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చామని తెలిపారు.
అర్నబ్ గోస్వామి నేతృత్వంలోని రిపబ్లిక్ టీవీ ఛానల్ సహా మూడు ఛానెళ్లు ఈ టీఆర్పీ మోసాలకు పాల్పడుతున్నాయని సీపీ తెలిపారు. వాటిపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే ఈ విషయంపై రిపబ్లిక్ టీవీకి సమన్లు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేగాక, అర్నబ్ను ప్రశ్నించే అవకాశం కూడా లేకపోలేదు.
కాగా, న్యూస్ ట్రెండ్స్, తప్పుడు వార్తల ప్రసారం చేస్తున్నాయన్న అనుమానాలు రావడంతో విచారణ చేయగా టీఆర్పీ రేటింగ్స్ను మేనేజ్ చేస్తున్నారన్న విషయం వెలుగులోకి వచ్చిందని పోలీసులు తెలిపారు.
ఇప్పటికే ఈ సమాచారం కేంద్రప్రభుత్వంకు అందజేశామని వెల్లడించారు. ఇక టీఆర్పీ రేటింగ్స్ను మేనేజ్ చేస్తున్న మూడు ఛానెల్స్ను గుర్తించడం జరిగిందని వాటికి సంబంధించిన బ్యాంకు ఖాతాలపై కూడా విచారణ జరుపుతామని ముంబై పోలీసులు చెప్పారు. ఈ ఛానెల్స్కు నిధులు ఎక్కడ నుంచి వచ్చాయి... బెదిరించి నిధులు రాబట్టారా, యాడ్స్ ఎలా వస్తున్నాయి అనే అంశాలను కూడా పరిశీలిస్తామని ముంబై పోలీస్ చీఫ్ పరమ్వీర్ సింగ్ చెప్పారు. ఇక రిపబ్లిక్ టీవీ టీఆర్పీ రేటింగ్స్ను కొనుగోలు చేసిందని ఇప్పుడే ముంబై పోలీసులు చెప్పారంటూ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ట్వీట్ చేశారు.
టీఆర్పీ రేటింగ్స్ గోల్మాల్ వ్యవహారంలో ఎంత పెద్ద వారున్నా వదిలేది లేదని వారిని పిలిచి విచారణ చేస్తామని ముంబై పోలీస్ బాస్ పరమ్వీర్ సింగ్ చెప్పారు. విచారణలో భాగంగా ఏదైనా నేరం జరిగిందని రుజువైతే వెంటనే వారి ఖాతాలను స్తంభింపజేస్తామని వెల్లడించారు. టీఆర్పీ రేటింగ్స్ మేనేజ్ చేసేందుకు ప్రతి ఇంటికి చెందిన సమాచారం సేకరించడం జరిగిందని పోలీసులు తెలిపారు. తప్పుడు రేటింగ్స్ చూపించి తద్వారా అక్రమంగా అడ్వర్టైజ్మెంట్ రూపంలో నిధులు పొందారని ఇది కచ్చితంగా మోసం చేయడమే అవుతుందని పోలీస్ చీఫ్ చెప్పారు.