టీఆర్పీ స్కామ్... బార్క్ మాజీ సీఈవో దాస్గుప్తాను అరెస్ట్ చేసిన ముంబై పోలీస్...
పలు టీవీ చానెళ్ల టీఆర్పీ కుంభకోణానికి సంబంధించిన కేసులో బార్క్(బ్రాడ్కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్) మాజీ సీఈవో పార్థో దాస్గుప్తాను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గురువారం(డిసెంబర్ 24) పుణేలో అరెస్ట్ చేశారు. దాస్గుప్తాను శుక్రవారం ముంబై కోర్టులో ప్రవేశపెడుతామని అరెస్ట్ అనంతరం మీడియాతో వెల్లడించారు. దాస్గుప్తా అరెస్టుతో టీఆర్పీ స్కామ్లో ఇప్పటివరకూ మొత్తం 15 మంది అరెస్టయ్యారు.
ఇదే కేసులో వారం రోజుల క్రితం బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ (బార్క్) కౌన్సిల్ మాజీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ) రోమిల్ రామ్ గర్హియాను ముంబై పోలీసు క్రైమ్ బ్రాంచ్కు చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అంతకుముందు రిపబ్లిక్ టీవీ సీఈవో ఖాన్ చందాని కూడా ఇదే కేసులో అరెస్టయ్యారు. డిసెంబర్ 15న పోలీసులు ఆయన్ను కస్టడీలోకి తీసుకోగా డిసెంబర్ 16వ తేదీన బెయిల్పై విడుదలయ్యారు.
బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్(బీఏఆర్సీ) కోసం పనిచేసే హన్సా రీసెర్చ్ గ్రూప్ టీఆర్పీ స్కామ్ వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. రిపబ్లిక్ టీవీ సహా మరో రెండు మరాఠీ టీవీ చానెళ్లు నకిలీ,టీఆర్పీ రేటింగ్లతో మోసాలకు పాల్పడుతున్నట్లు ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ టీఆర్పీని పెంచుకునేందుకు ఈ చానెళ్లు కొంతమందికి డబ్బులిచ్చి మరీ టీఆర్పీ సిస్టమ్ను టాంపరింగ్ చేస్తున్నాయని ఆరోపించింది. అంటే,ఎవరికైతే డబ్బులు చెల్లించారో... వారి ఇళ్లల్లో కొంత సమయం పాటు ఆ చానెళ్లనే చూసేలా వారితో డీల్ కుదుర్చుకున్నారని ఆరోపించింది.
మరోవైపు రిపబ్లిక్ టీవీ యాజమాన్యం మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి వ్యవహారంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపినందుకే తమపై కక్ష సాధింపుకు పాల్పడుతున్నారని ఆరోపించింది. నిజానికి ఈ కేసును మొదట సీబీఐకి అప్పగించిన మహారాష్ట్ర ప్రభుత్వం ఆ తర్వాత ఉపసంహరించుకుంది. ముంబై పోలీసులే దీని విచారణ చేపడుతారని స్పష్టం చేసింది.