TRP SCAM:తెరపైకి ఇండియాటుడే పేరు..ఎఫ్ఐఆర్ నమోదు..రోడ్డుకెక్కిన ఛానెళ్ల రచ్చ..!
ముంబై: ఈ మధ్యకాలంలో టీఆర్పీ రేటింగ్ల కోసం టీవీ ఛానెళ్లు పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలోనే కొన్ని అవాస్తవ వార్తలను ప్రసారం చేస్తున్నాయి. ఇక టీవీ ఛానెళ్లు నెంబర్ వన్ స్థానంలో ఉందని చెప్పేందుకు టీఆర్పీ రేటింగ్స్నే పరిగణలోకి తీసుకుంటారు. నీతి వాక్యాలు బోధించే పలు వార్తా ఛానెళ్లు తెరవెనుక టీఆర్పీ రేటింగ్స్ను మ్యానుపులేట్ చేస్తున్నాయన్న అసలు నిజం వెలుగులోకి ఆలస్యంగా వచ్చింది. ఇందులో ప్రముఖ జాతీయ ఛానెల్ రిపబ్లిక్ టీవీతో పాటు, మరో జాతీయ ఛానెల్ ఇండియా టుడే ఇంకో న్యూస్ ఛానెల్స్ను ముంబై పోలీసులు గుర్తించారు.
వెలుగులోకి ఇండియా టుడే
గురువారం రోజున స్కామ్లో రిపబ్లిక్ టీవీ పేరు గట్టిగా వినిపించింది. అంతేకాదు దీనిపై ఆ టీవీ ప్రత్యేక ప్రకటన కూడా ఇచ్చింది. అయితే మరో రెండు ఛానెల్స్ ఏంటనే దానిపై ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే మరో జాతీయ ఛానెల్ ఇండియా టుడే పేరు వెలుగులోకి వచ్చింది. ఈ ఛానెల్పై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ముంబై పోలీసులు తమకు స్పష్టం చేశారని టైమ్స్నౌ పేర్కొంది. అయితే దీన్ని ఇండియాటుడే లేదా సాక్షులు కానీ ధృవీకరించలేదని పోలీస్ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతోందని త్వరలోనే అన్ని విషయాలు బయటకు వస్తాయని ముంబై పోలీసు వర్గాలు తెలిపాయి. అక్టోబర్ 6వ తేదీన ఇండియా టుడే పై ఎఫ్ఐఆర్ నమోదైనట్లు సమాచారం.
పలు ప్రశ్నలు సంధించిన రిపబ్లిక్ ఛానెల్
ఇదిలా ఉంటే రిపబ్లిక్ న్యూస్ ఛానెల్ మాత్రం తమ టీవీలో మరో కథనం ప్రసారం చేస్తోంది. అక్టోబర్ 6వ తేదీన ఇండియాటుడే పై ఎఫ్ఐఆర్ నమోదు కాగా.. ముంబై పోలీస్ చీఫ్ ఇన్వెస్టిగేషన్ను ఎందుకు నిలిపివేశారంటూ ప్రశ్నిస్తోంది. ఎఫ్ఐఆర్లో ఇండియా టుడే పేరును మూడు సార్లు ప్రస్తావించారని రిపబ్లిక్ టీవీ పేరు ఒక్క చోట కూడా ప్రస్తావించలేదని రిపబ్లిక్ టీవీ వాదిస్తోంది. ఇక టీఆర్పీ రేటింగ్స్ కోసం ఇండియా టుడే డబ్బులు ఎరవేసిందనే మాట కూడా ఎఫ్ఐఆర్లో ఉందని రిపబ్లిక్ టీవీ కథనాలను ప్రసారం చేసింది.
Recommended Video
రచ్చకెక్కుతున్న ఛానెళ్లు
ఇక రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామికి నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. విచారణకు శుక్రవారం సాయంత్రంలోగ హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. రోజులో కొంత సమయం రిపబ్లిక్ టీవీ పెట్టేందుకు ఒక్కో ఇంటికి రూ.400 నుంచి రూ.500 వరకు చెల్లించినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు ముంబై పోలీస్ చీఫ్ పరంబీర్ సింగ్ గురువారం చెప్పారు. ఇదిలా ఉంటే ఇండియా టుడే పేరు చెప్పగానే న్యూస్ ఫాలో అయ్యేవారికి టక్కున గుర్తుకొచ్చే పేరు రాజ్దీప్ సర్దేశాయ్. ప్రస్తుతం ఛానెల్స్ టీఆర్పీ రేటింగ్స్ కోసం తప్పుదారులు పడుతుండటం పై ప్రజల్లో విశ్వాసం కోల్పోతున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.