టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఐటీ షాక్ ? 2014, 2018 ఆస్తుల్లో భారీ తేడాలు ఎందుకని నోటీసులు ?
న్యూఢిల్లీ : టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఐటీ షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. 2014, 2018 మధ్య ఆస్తుల్లో భారీ తేడాలపై నోటీసులు ఇచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది. దీనికి సంబంధించి వారం రోజుల క్రితం ఓ పత్రికలో కథనం ప్రచురితమైంది. దానికి బలం చేకూరుస్తూ మీడియాలో వార్త కూడా ప్రసారమైంది.
భారీగా పెరిగిన ఆస్తులు
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆస్తులు భారీగా పెరిగినట్టు ఐటీశాఖ గుర్తించింది. దీంతో 2014, 2018తోపాటు మధ్యలో దాఖలు చేసిన ఐటీ రిటర్నులను కూడా పరిశీలిస్తామని చెప్పినట్టు సమాచారం. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆస్తులు, అప్పుల్లో భారీ తేడా రావడంతో ఐటీ శాఖ నజర్ పెట్టినట్టు ఆయా వర్గాల ద్వారా తెలుస్తోంది. ఆయా పత్రాల్లో ఆస్తులు అప్పుల లెక్కలకు సంబంధించి భారీ తేడాలు ఉంటే.. అందుకు కారణాలను ఆధారాలతో సహా వివరించాలని నోటీసుల్లో పేర్కొన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
నోటీసులు జారీ
ఎమ్మెల్యేల ఆస్తుల వివరాల్లో గతంతో పోలిస్తే భారీ తేడా కనిపించడంతో ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. ప్రజా ప్రతినిధుల ఆస్తులు భారీగా పెరిగినట్టు గుర్తించిన ఐటీ శాఖ ఈ మేరకు చర్య తీసుకున్నట్టు సమాచారం. అయితే ఎమ్మెల్యేలు ఎంతమందికి నోటీసులు పంపించిందో క్లారిటీ రాలేదు.
ఒక్కసారి పోటీచేసిన వారికి కూడా ..
ఎన్నికల్లో వరుసగా పోటీ చేయడమే కాదు 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి గెలిచిన వారు ఈసీకి సమర్పించిన అఫిడవిట్, అంతకు ముందు దాఖలు చేసిన ఐటీ రిటర్నుల వివరాలను అందజేయాలని నోటీసుల్లో ఐటీశాఖ పేర్కొన్నట్లు సమాచారం. డిసెంబర్లో తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరాం అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. అయితే మిగతా రాష్ట్రాల్లో గెలిచిన ఎమ్మెల్యేలకు మాత్రం ఐటీ శాఖ నోటీసులు జారీ చేయలేదు.
అంతర్యమెంటో ?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు కూడా ఐటీ శాఖ నుంచి నోటీసులు రాలేదు. దీంతో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు నోటీసుల వెనక కేంద్ర ప్రభుత్వం ఉందా ? అనే అనుమానాలు కలుగుతున్నాయి. తమతో పాటు పోటీచేసిన రాష్ట్రాల ఎమ్మెల్యేలకు, రాష్ట్రంలో విపక్ష కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు రానీ నోటీసులు టీఆర్ఎస్ పార్టీ లక్ష్యంగా ఎందుకు వస్తున్నాయని ఆ పార్టీలో అంతర్గతంగా చర్చలు జరుగుతున్నాయి.