విద్యుత్ ఒప్పందాలపై ఆధారాలుంటే కోర్టుకెళ్ళండి: కెటిఆర్
హైదరాబాద్: ఎన్నికలు ఎప్పుడొచ్చినా టిఆర్ఎస్ సిద్దంగా ఉందని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కెటిఆర్ తేల్చి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్ళే యోచనలో ఉన్నట్టు వార్తలు వస్తున్న సమయంలో కెటిఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకొన్నాయి.
శనివారం సాయంత్రం కొద్దిసేపు మంత్రి కెటిఆర్ మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేశారు. ఎన్నికలకు తాము ఎప్పుడూ సిద్దంగానే ఉన్నామని మంత్రి ప్రకటించారు.
విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో అవకతవకలు చోటు చేసుకొన్నాయని కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలను మంత్రి తోసిపుచ్చారు.ఈ ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. వ్యవసాయానికి 24 గంటల పాటు విద్యుత్ ను సరఫరా చేస్తున్నందున కాంగ్రెస్ పార్టీ తమ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని మంత్రి చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలకు సంబంధించి ఆధారాలుంటే కోర్టుకు వెళ్ళాలని మంత్రి కెటిఆర్ సూచించారు.విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు సంబంధించి అసెంబ్లీలో చర్చించేందుకు తాము సిద్దంగా ఉన్నామని కెటిఆర్ ప్రకటించారు.