భారత్ హెచ్చరించినా.. రైతు ఉద్యమానికి కెనడా ప్రధాని మరోసారి మద్దతు.. ఐరాస కూడా...
ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న రైతు ఉద్యమానికి బయటి నుంచి మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే రైతు ఉద్యమానికి మద్దతు ప్రకటించి భారత్ ఆగ్రహానికి గురైన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తాజాగా మరోసారి రైతులకు తమ మద్దతును ప్రకటించారు. ప్రపంచంలో ఎక్కడ శాంతియుత నిరసనలు జరిగినా కెనడా మద్దతు ఉంటుందన్నారు. చర్చలతో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తే బాగుంటుందని మరోసారి సూచించారు. అటు ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటానియో గుటెర్స్ అధికార ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ కూడా రైతు ఉద్యమంపై స్పందించారు.
Recommended Video
ఐరాస ప్రతినిధి ఏమన్నారంటే...
శాంతియుత నిరసన ప్రదర్శనలు ప్రజల హక్కు అని... అందుకు అధికారులు అనుమతించాలని స్టీఫెన్ డుజారిక్ భారత్కు విజ్ఞప్తి చేశారు. దేశ అంతర్గత వ్యవహారాల్లో విదేశీ నాయకుల జోక్యం సరికాదని... ట్రూడో వ్యాఖ్యలను భారత్ తప్పు పట్టిన తరుణంలో స్టీఫెన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 'ప్రజలు తమ జీవితంలో ఒక గొంతుకను కలిగి ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఇలాంటి సమస్యలు ఉత్పన్నమైనప్పుడు నేను చెప్పేదేమిటంటే... ప్రజలకు శాంతియుతంగా నిరసన తెలియజేసే హక్కు ఉంటుంది. అందుకు అధికారులు వారిని అనుమతించాలి.' అని స్టీఫెన్ డుజారిక్ పేర్కొన్నారు. తన డైలీ బ్రీఫింగ్లో భాగంగా ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు స్టీఫెన్ ఇలా స్పందించారు.
ఇటీవల మద్దతు పలికిన కెనడా ప్రధాని...
ఇటీవలే కెనడా ప్రధాని ట్రూడో భారత రైతుల శాంతియుత నిరసనలకు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. ట్రూడోతో పాటు అక్కడి కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ప్రతిపక్ష నేత ఎరిన్ ఊటూల్ కూడా రైతుల విషయంలో భారత్ వైఖరిని తప్పు పట్టారు. రైతులు,వారి కుటుంబాల పరిస్థితిపై తాము ఆందోళన చెందుతున్నామని... చర్చల ద్వారా పరిస్థితిని చక్కదిద్దే అవకాశం ఉందని తాము భావిస్తున్నామని చెప్పారు. కెనడాలో గురునానక్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని అక్కడి ప్రజలతో ఓ ఆన్లైన్ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ట్రూడో ఈ వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మరోసారి రైతు ఆందోళనలకు మద్దతు పలికారు.
ఐరాస వ్యాఖ్యలపై భారత్ రియాక్షన్ ఎలా ఉంటుందో?
ట్రూడో,రిన్ ఊటూల్ చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్ర స్థాయిలో స్పందించింది. వాస్తవాలు తెలుసుకోకుండా భారత అంతర్గత వ్యవహారంపై మాట్లాడటం సరికాదని పేర్కొంది. అంతేకాదు,కెనడాతో భారత దౌత్య వ్యవహారాలపై రాజకీయ ప్రభావం పడకుండా చూసుకోవాలని హెచ్చరించింది. అయినప్పటికీ కెనడా ప్రధాని మరోసారి భారత రైతుల ఆందోళనలకు మద్దతు పలకడం చర్చనీయాంశంగా మారింది. ట్రూడో తాజా వ్యాఖ్యలపై.. అలాగే ఐరాస సెక్రటరీ జనరల్ ప్రతినిధి చేసిన వ్యాఖ్యలపై భారత్ ఎలా స్పందిస్తున్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం రైతులతో శనివారం(డిసెంబర్ 5) మూడో దఫా చర్చలు జరుపుతోంది. గత 10 రోజులుగా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో చేస్తున్న ఆందోళనలకు తాజా సమావేశాలతోనైనా ఫుల్ స్టాప్ పడుతుందా లేక పురోగతి లేకుండానే చర్చలు ముగుస్తాయా అన్న ఆసక్తి నెలకొంది.