కశ్మీర్పై అమెరికా జోక్యం ఏంటి...ప్రధాని మోడీ సమాధానం చెప్పాల్సిందే: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: కశ్మీర్ విషయంలో భారత్ పాక్ల మధ్య మధ్యవర్తిత్వం జరపాలని ప్రధాని మోడీ ట్రంప్ను కోరినట్లు అమెరికా అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త వివాదానికి తెరలేపింది. ఇదే విషయంపై ప్రధాని నరేంద్ర మోడీ సమాధానం ఇవ్వాలంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. కశ్మీర్ అంశంపై అమెరికా కలగజేసుకోవాలని తనను కోరినట్లు స్వయంగా ఆదేశాధ్యక్షుడే చెప్పారని దీనిపై ప్రధాని వివరణ ఇవ్వాలని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ భారతీయుల నమ్మకాన్ని వమ్ము చేశారని దుయ్యబట్టారు.
President Trump says PM Modi asked him to mediate between India & Pakistan on Kashmir!
— Rahul Gandhi (@RahulGandhi) July 23, 2019
If true, PM Modi has betrayed India’s interests & 1972 Shimla Agreement.
A weak Foreign Ministry denial won’t do. PM must tell the nation what transpired in the meeting between him & @POTUS
ప్రధాని మోడీ భారతీయుల నమ్మకాన్ని వమ్ముచేయడంతోపాటు 1972 షిమ్లా ఒప్పందాన్ని కూడా తుంగలో తొక్కారని మండిపడ్డారు. మరోవైపు కశ్మీర్ అంశంలో అమెరికా జోక్యం చేసుకోవాలంటూ ప్రధాని ఎప్పుడూ కోరలేదని పార్లమెంటులో స్పష్టం చేశారు విదేశీవ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్. సభలో మంత్రి ఇచ్చిన వివరణను కూడా రాహుల్ గాంధీ ఖండించారు. ప్రధాన మంత్రి జవాబు ఇవ్వాల్సిందేనంటూ ఇరు సభల్లో కాంగ్రెస్ ఎంపీలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.ఇదిలా ఉంటే లోక్సభలో విపక్షాలు వాకౌట్ చేశాయి.ఇదిలా ఉంటే భారత్ పాకిస్తాన్ల మధ్య అన్ని సమస్యలకు సమాధానం ద్వైపాక్షిక చర్చలతోనే దొరుకుతుందని సభకు వివరించారు.
పాకిస్తాన్తో చర్చలు జరిపితేనే సరిహద్దుల దగ్గర చొరబాట్లు సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుందని జైశంకర్ అభిప్రాయపడ్డారు.ఇదిలా ఉంటే కశ్మీర్ అంశంపై ప్రధాని మోడీ జోక్యం చేసుకోవాలని తనను కోరినట్లు సోమవారం ట్రంప్ చెప్పారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ ట్రంప్తో భేటీ అయిన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్యనే మోడీతో తాను సమావేశం అయినప్పుడు చెప్పినట్లు ట్రంప్ వెల్లడించారు.