ప్రపంచ దేశాలపై ట్రంప్ కస్సు బుస్సులు..! చైనా, రష్యాలను టార్గెట్ చేసిన యూఎస్ అద్యక్షుడు..!!
లండన్/హైదరాబాద్ : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై మరోసారి నోరు పారేసుకున్నారు. తమ దేశంలాగా మరే ఇతర దేశం పర్యావరణ పరిరక్షణకు పాటుపడటం లేదంటూ ఆత్మస్తుతి చేసుకున్నారు. ఈ క్రమంలో చైనా, రష్యా వంటి దేశాలు పర్యావరణ పరిరక్షణ పట్ల బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శలు గుప్పించారు.
తన మూడు రోజుల బ్రిటన్ పర్యటనలో భాగంగా ట్రంప్ బ్రిటన్ రాజు ప్రిన్స్ చార్లెస్ను కలిశారు. ఈ క్రమంలో పర్యావరణం, వాతావరణ మార్పు తదితర అంశాలపై ఆయనతో చర్చలు జరిపారు. ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన వాతావరణం ఉన్న దేశాల్లో అమెరికా ఒకటని అన్నారు. తాను ప్రిన్స్ చార్లెస్ తో 15 నిమిషాల పాటు మాట్లాడాలని అనుకున్నానని, కానీ అది గంటన్నర పాటు సాగిందని, అత్యధికంగా తమ మధ్య పర్యావరణంపైనే చర్చ సాగిందని చెప్పారు.
అమెరికాలో ప్రజలు స్వచ్ఛమైన గాలిని పీలుస్తుంటే, ఇండియా, చైనా, రష్యా వాసులు కలుషిత వాతావరణంలో బతుకుతున్నారని, ఆ దేశాల ప్రజలకు పరిశుభ్రతపై అవగాహనే లేదని ఎద్దేవా చేశారు. ఈ దేశాల్లోని కొన్ని నగరాల పేర్లను తాను చెప్పబోనని అంటూనే, అక్కడికి వెళితే, కనీసం గాలిని కూడా పీల్చుకునే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు.
ఇక ట్రంప్ బ్రిటన్ పర్యటనను ఆదేశ ప్రజలు పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. ట్రంప్ బ్రిటన్ కు రావాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పుకొస్తున్నారు. అందుకు వినూత్న రీతిలో నిరసన తెలుపుతున్నారు. దుందుడుకు వ్యాఖ్యలకు మారుపేరైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు మిత్రుల కంటే శత్రువులు ఎక్కువయ్యారు. వలసల విషయంలో ట్రంప్ నిర్ణయాలు, చర్యలపై వారంతా నిరసనలు తెలియజేస్తున్నారు.
తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బ్రిటన్ పర్యటనకు వ్యతిరేకంగా బ్రిటిషర్లు వినూత్నంగా నిరసన తెలిపారు. చేతిలో స్మార్ట్ ఫోన్ తో టాయిలెట్ పై ట్రంప్ కూర్చున్నట్లు ఉన్న పెద్ద బొమ్మను లండన్ నగరంలో ఏర్పాటుచేశారు. దాని తలపై అమర్చిన టోపీపై అమెరికాను మళ్లీ గొప్పగా చేద్దామా? నన్ను పదవీచ్యుతుడిని చేయండి అని రాశారు. త్రాఫాల్గర్ స్క్వేర్ వద్ద ఏర్పాటు చేసిన ఈ బొమ్మ వద్ద భారీగా గుమిగూడిన ప్రజలు ట్రంప్ రాకకు వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు.