ట్రంప్ భారత్ పర్యటన: ఐటీసీ మౌర్య హోటల్లో బస... ఒక్క రాత్రికి ఈ గది ధర ఎంతో తెలుసా..?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు వస్తున్న సందర్భంగా ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. అహ్మదాబాద్ నుంచి ఆగ్రా ఆ తర్వాత ఢిల్లీకి చేరుకోనున్న అగ్రరాజ్యం అధినేతకు ఘనంగా ఏర్పాట్లు చేసింది భారత ప్రభుత్వం. మధ్యాహ్నం 11:30 నుంచి 12 గంటల ప్రాంతంలో ట్రంప్ విమానం ఎయిర్ఫోర్స్ వన్ అహ్మదాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ కానుంది. అక్కడ సబర్మతీ ఆశ్రమంను సందర్శించి నమస్తే ట్రంప్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ట్రంప్ దంపతులు బయలుదేరి వెళతారు. ఆ కార్యక్రమం ముగిశాక నేరుగా ఆగ్రాకు వెళ్లి తాజ్మహల్ను సందర్శిస్తారు. అక్కడి నుంచి ట్రంప్ దంపతులు ఢిల్లీకి వెళతారు. రాత్రి ఢిల్లీలోని ఐటీసీ మౌర్య హోటల్లో బస చేస్తారు.
ఐటీసీ మౌర్య హోటల్కు ట్రంప్ దంపతులు
ఢిల్లీలోని ఐటీసీ మౌర్య హోటల్లో పలువురు ప్రపంచదేశాధినేతలు బసచేశారు. ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్లో ఈ హోటల్ ఉంది. ఇక ట్రంప్ దంపతులు ఇక్కడ బసచేస్తుండటంతో గట్టి బందోబస్తును ఏర్పాటు చేసింది ప్రభుత్వం. గత కొద్ది రోజులుగా ఐటీసీ మౌర్య హోటల్ భద్రతా బలగాల చేతిలోకి వెళ్లిపోయింది. హోటల్ అనువనువునా చెక్ చేస్తున్నాయి భద్రతా బలగాలు. ఇక ట్రంప్ బస చేయనున్న గది హోటల్లోని 14వ అంతస్తులో ఉంది. ఈ గది అత్యంత విలాసవంతంగా ఉంటుంది. అన్ని సదుపాయాలు ఈ గదిలో ఉన్నాయి. ఇదొక అపార్ట్మెంట్ను తలపిస్తుంది. మొత్తానికి ఒక్క రాత్రికి ఈ హోటల్ ఖర్చు రూ.8 లక్షల అవుతుందని సమాచారం.
విలాసవంతమైన ప్రెసిడెన్షియల్ సూట్
ఈ ప్రెసిడెన్షియల్ సూట్ను అత్యంత సుందరంగా తీర్చి దిద్దారు. వుడెన్ ఫ్లోరింగ్, గోడలపై అందమైన పెయింటింగ్స్, ఒక పెద్ద లివింగ్ రూమ్, నెమలి ఆకారంలో ఉండే ప్రైవేట్ డైనింగ్ రూమ్, విలాసవంతమైన రెస్ట్ రూమ్లతో పాటు రిసెప్షన్ ఏరియా, మిని స్పా, జిమ్లు ఉంటాయి. ఇక ట్రంప్ మెనూ చూస్తే ఆయనకు ఇష్టమైన ఆహారంను వడ్డించనున్నారు. ఇందులో డైట్ కోక్, చెర్రీ వెనీలా ఐస్క్రీమ్లు ఉన్నాయి. ఇక ట్రంప్ దంపతుల కోసం ప్రత్యేకంగా ఓ చెఫ్ను ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ఇష్టమైన వంటకాలు ఏమిటో తెలుసుకుని అప్పటికప్పుడు సిద్ధం చేస్తారు.
Recommended Video
మౌర్య హోటల్లో బస చేయనున్న నాల్గవ అమెరికా అధ్యక్షుడు ట్రంప్
హోటల్ ఐటీసీ మౌర్యలో బస చేయనున్న నాల్గవ అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గుర్తింపు పొందారు. అంతకుముందు బిల్ క్లింటన్, జార్జ్ బుష్, ఒబామాలు అధ్యక్ష హోదాలో ఈ హోటల్లో బస చేశారు. ఇక ట్రంప్ దంపతులతో పాటు మెలానియా ట్రంప్, కూతురు ఇవాంకా ట్రంప్, అల్లుడు జేర్డ్ కుషర్లు కూడా రానున్నారు. వీరు కూడా ఐటీసీ మౌర్యలోనే బసచేయనున్నారు. భారత్లో ట్రంప్ దంపతులు రెండు రోజుల పాటు ఉండనున్నారు. అన్ని కార్యక్రమాలు ముగించుకుని మంగళవారం రాత్రి 10 గంటలకు తిరిగి అమెరికాకు ప్రయాణమవుతారు.