ట్రంప్ కొడుకు మెగా ప్రాజెక్ట్: గుర్గావ్లో ట్రంప్ టవర్స్, 2500కోట్ల లాభం!
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన 'ట్రంప్ టవర్స్' తొలిసారిగా ఉత్తర భారతదేశంలో తన వ్యాపార లావాదేవీలను ప్రారంభిస్తోంది. 'ఎం3ఎం ఇండియా', ట్రైబెకా డెవలపర్స్ పేరిట అత్యంత విలాసవంతమైన గృహ సముదాయాలను ఢిల్లీ సమీపంలోని గుర్గావ్లో 'ట్రంప్ టవర్స్' నిర్మిస్తోంది.
'డ్రీమర్' దెబ్బ: ఈ అమెరికా కోర్టులేంటో అంటూ ట్రంప్ అసహనం
ఇందుకు సుమారు 1,200 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెడుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనయుడు జూనియర్ ట్రంప్ నిర్వహిస్తున్న 'ది ట్రంప్ ఆర్గనైజేషన్' నుంచి అనుమతి పొందిన 'ఎం3ఎం ఇండియా', ట్రైబెకా డెవలపర్స్ సంస్థలు అత్యంత ఖరీదైన 258 అపార్ట్మెంట్లను ఇక్కడ నిర్మిస్తాయి.
భారీ ఎత్తున నిర్మాణాలు.. ఫ్లాట్లు ఖరీదే
ఈ బహుళ అంతస్థుల భవనాల్లో మూడు, నాలుగు పడక గదుల ఇళ్లను నిర్మిస్తారు. వీటి ధర 5 నుంచి 10 కోట్ల రూపాయలుగా ఉండవచ్చని, 3,500 చదరపు అడుగులు, 6,000 చదరపు అడుగుల్లో భవంతులను నిర్మిస్తారని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
‘ట్రంప్ టవర్స్' ఇప్పటికే ముంబై, పుణె, కోల్కతా నగరాల్లో తన ప్రాజెక్టులను ప్రారంభించగా, ఉత్తర భారతానికి సంబంధించి గుర్గావ్లో తొలి ప్రాజెక్టును చేపడుతున్నట్టు ‘ఎం3ఎం ఇండియా' డైరెక్టర్ పంకజ్ బన్సాల్ తెలిపారు. అంతేగాక, ఇప్పటికే ఈ టవర్లో 20అపార్ట్మెంట్లకు గానూ రూ.150కోట్ల చెక్కులను అందుకున్నామని చెప్పారు.
అంతా వినూత్నమే..
తమ హౌసింగ్ ప్రాజెక్టులపై కస్టమర్లలో అవగాహన కలిగించేందుకు ట్రంప్ టవర్స్ వినూత్న కార్యక్రమాలను చేపడుతోంది. వందమంది ఫ్లాట్ కొనుగోలుదారులను అమెరికా తీసుకువెళ్లి జూనియర్ ట్రంప్ సమక్షంలో ఘనంగా ఆతిథ్యం ఇస్తారు. విస్మయం కలిగించే ఆకృతులు, విస్తృతమైన సౌకర్యాలు, అందచందాలు ఉట్టిపడే నిర్మాణం చూసి కస్టమర్లు కచ్చితంగా ఆకర్షితులవుతారని ‘ట్రంప్ టవర్స్' ప్రతినిధులు ధీమాగా చెబుతున్నారు.
ప్రతిష్టాత్మకంగా..
దేశ రాజధాని ప్రాంతం(గుర్గావ్)లో తాజా ప్రాజెక్టును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్నామని సంస్థ ప్రతినిధులు చెప్పారు. సుమారు 50 అంతస్థుల్లో నిర్మించే ఈ భవంతుల్లో విలాసవంతమైన సౌకర్యాలను ఏర్పాటుచేసి ఊదేళ్ల కాలవ్యవధిలో పూర్తి చేయనున్నట్లు వివరించారు. భూమి ఖరీదు కాకుండా, ఈ ప్రాజెక్టుకు 1,200 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని ప్రాథమికంగా అంచనా వేశారు.
రూ. 2500కోట్ల లాభం
కాగా, ఈ భవనాలను విక్రయించడం ద్వారా 2,500 కోట్ల రూపాయల లాభం ఉంటుందని అంచనా సంస్థ ప్రతినిధులు అంచనా వేశారు. భారత్లో చేపట్టిన తమ ప్రాజెక్టుల్లో ఇది అత్యంత ఖరీదైనదని ‘ట్రైబెకా డెవలపర్స్' ప్రతినిధి కల్పేష్ మెహతా తెలిపారు. వీటిని విక్రయించేందుకు ఎన్ఆర్ఐల సేవలను కూడా వినియోగించుకుంటామని వివరించారు. 2014లో ట్రంప్ టవర్స్ కంపెనీ మన దేశంలో అడుగుపెట్టింది.