ట్రంప్ నేరుగా భారత్ రావట్లేదు.. టూర్లో మరో మెలిక.. మోదీ కంటే ముందే అమిత్ షా..
వాణిజ్య ఒప్పందం మొదలుకొని, ద్వైపాక్షిక చర్చల దాకా.. భారత పర్యటనలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చేయబోతున్నారనేది ఇప్పటికీ సస్పెన్స్ గానే కొనసాగుతోంది. అలాగే, ఆయన ప్రయాణానికి సంబంధించి కూడా చివరి నిమిషంలో కీలకమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటిదాకా ప్రచారంలో ఉన్నట్టు.. ప్రెసిడెంట్ ప్రత్యేక విమానం 'ఎయిర్ ఫోర్స్వన్' వాషింగ్టన్ నుంచి నేరుగా అహ్మదాబాద్కు రావడంలేదు. మధ్యలో జర్మనీలో ల్యాండై, కొంతసేపు విశ్రాంతి, చర్చల తర్వాతే ఆయన భారత్ బయల్దేరనున్నారు. ఆ వివరాలు ఏవంటే..
క్యా సీన్ హై: బాహుబలిగా ట్రంప్: మార్ఫింగ్ వీడియో రీట్వీట్: వైట్హౌస్ కామెంట్.. !
రాత్రి 7:30కు టేకాఫ్..
భార్యబిడ్డలతో కలిసి భారత్ విచ్చేయనున్న తొలి అమెరికా ప్రెసిండెంట్ గా ట్రంప్ రికార్డు నెలకొల్పుతారు. ప్రెసిడెంట్ ట్రంప్, ఫస్ట్ లేడీ మెలానియా, ప్రెసిడెంట్ కు సలహాదారు, కూతురైన ఇవాంకా ట్రంప్, ట్రంప్ కేబినెట్ లోని ముఖ్య శాఖల మంత్రులతో కూడిన బృందం.. ఆదివారం రాత్రి 7:30(అమెరికా కాలమానం ప్రకారం) వాషింగ్టన్ లోని జాయింట్ ఎయిర్ బేస్ నుంచి టేకాఫ్ తీసుకుంటారు. ముందుగా వెల్లడైనట్లు విమానం నేరుగా అహ్మదాబాద్ చేరుకోవాలి. కానీ ఇప్పుడది జర్మనీ వైపు మళ్లనుంది.
రాయిన్ ల్యాండ్ లో రెస్ట్..
ఆదివారం రాత్రి 7:30కు వాషింగ్టన్ లో టేకాఫ్ తీసుకోనున్న ట్రంప్ విమానం.. తర్వాతి రోజు ఉదయం 4:45కు జర్మనీలోని రాయిన్ ల్యాండ్ లో ల్యాండవుతుంది. లక్సంబర్గ్, బెల్జియం, నెదర్లాండ్స్ సరిహద్దుల్లోని రాయిన్ ల్యాండ్.. సైనికపరంగానూ జర్మనీకి చాలా కీలకమైనది. స్వల్ప విరామంలో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్.. జర్మనీ ఉన్నతాధికారులతో మాట్లాడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత విమానం నేరుగా అహ్మదాబాద్ కు బయలుదేరనుంది. టైమ్ లైన్లు మారుతూ మొత్తంగా ట్రంప్ బృందం 36గంటలకుపైగా ప్రయాణించి భారత్ లోకి అడుగుపెట్టనున్నారు.
మోదీ కంటే ముందే షా..
అమెరికా ప్రెసిడెంట్ పర్యటనను భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తుండటంతో అదిరిపోయే ఆతిథ్యాన్ని సిద్ధం చేశారు. ప్రధాని మోదీ కంటే ఒకరోజు ముందే కేంద్ర హోం మంత్రి అమిత్ షా అహ్మదాబాద్ చేరుకున్నారు. ఆదివారం మధ్యాహ్నమే సిటీకి వచ్చిన షా.. ట్రంప్ స్వాగత ఏర్పాట్లను పర్యవేక్షించారు. ‘నమస్తే ట్రంప్' వేడుకను నిర్వహించనున్న మోతేరా స్టేడియాన్ని కూడా షా సందర్శించే అవకాశముంది.
మోదీ ట్వీట్
ట్రంప్ పర్యటన నేపథ్యంలో ప్రధాని మోదీ ఆదివారం మరోసారి ట్వీట్ చేశారు. అమెరికా ప్రెసిడెంట్ రాకకోసం భారత్ ఉత్సాహంగా ఎదరుచూస్తున్నదని అన్నారు. ఈ పర్యటన రెండు దేశాల సంబంధాలకు ఎంతో కీలకమైందని, ఎప్పటికీ గుర్తుండిపోయేలా అతిథుల్ని గౌరవిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. ట్రంప్ తో పాటు మోదీ పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.