భారత పర్యటనలో ట్రంప్ సీఏఏపై మాట్లాడబోతున్నారా.. వైట్ హౌజ్ వర్గాలు ఏమంటున్నాయి..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 24,25 తేదీల్లో భారత్లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ట్రంప్ రాక నేపథ్యంలో ఇరు దేశాల మధ్య కుదిరే వాణిజ్య ఒప్పందాల పైనే ఎక్కువ చర్చ జరుగుతోంది. అయితే వాణిజ్య ఒప్పందాలతో పాటు భారత ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(CAA) గురించి కూడా ట్రంప్ ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించబోతున్నారు. ఈ విషయాన్ని అమెరికా వైట్ హౌజ్ శుక్రవారం(ఫిబ్రవరి 21)న వెల్లడించింది.
మత స్వేచ్చపై మాట్లాడనున్న ట్రంప్..
భారత పర్యటనలో ట్రంప్ ప్రధాని మోదీతో మత స్వేచ్చ గురించి మాట్లాడుతారని వైట్ హౌజ్ వర్గాలు తెలిపాయి. ప్రధానితో భేటీలోనూ,అలాగే తన ప్రసంగంలోనూ ఈ అంశాన్ని ట్రంప్ ప్రస్తావిస్తారని చెప్పాయి. పాలనా పరమైన అంశాల్లో మత స్వేచ్చ అనేది కూడా కీలకమని.. అందుకే ట్రంప్ ఈ విషయాన్ని ప్రస్తావించబోతున్నారని తెలిపాయి.
ఎన్ఆర్సీ,సీఏఏలపై
నైతిక విలువలు, న్యాయ నిబంధనల పట్ల భాగస్వామ్య నిబద్ధత తమకు ఉందని.. భారతదేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలు, సంస్థలపై తమకు చాలా గౌరవం ఉందని వైట్ హౌజ్కి చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఆ సంప్రదాయాలను కొనసాగించేందుకు భారతదేశాన్ని తాము ప్రోత్సహిస్తూనే ఉంటామన్నారు. అలాగే సీఏఏ,ఎన్ఆర్సీ వంటి అంశాలను లేవనెత్తే ఆలోచన కూడా ఉందన్నారు.
భారత సంస్కృతి,సాంప్రదాయాలపై..
భారత రాజ్యాంగంలోనే మత స్వేచ్చ గురించి పొందుపరిచారని.. మైనారిటీల మత స్వేచ్చ,అన్ని మతాలను సమదృష్టితో చూడాలన్న నిబంధనలు అందులో ఉన్నాయని తెలిపారు. మత పరంగా,భాష పరంగా,సంస్కృతి పరంగా భారత్ చాలా సంపన్న దేశమని.. ప్రజాస్వామ్య పునాదుల మీద నిర్మితమైనదని గుర్తుచేశారు. నిజానికి భారత్ ప్రపంచంలోని నాలుగు ప్రధాన మతాలకు పుట్టినిల్లు అని చెప్పారు.
Recommended Video
మైనారిటీలను సమదృష్టితో చూడాలని..
ప్రధాని నరేంద్ర మోదీ మొదటిసారి ప్రధాని అయినప్పుడు చేసిన ప్రసంగంలో.. మైనారిటీలకు ఎలాంటి ప్రాధాన్యతనిస్తామో,ఎలా కలుపుకుని ముందుకు వెళ్తామో చెప్పారని గుర్తుచేశారు. కాబట్టి ప్రపంచ దేశాలన్నీ ఆ విషయంలో భారత్ను గమనిస్తాయని అన్నారు. రాజ్యాంగానికి కట్టుబడి మత స్వేచ్చ,సమానత్వం అందరికీ అందుతున్నాయో లేదో ప్రపంచం గమనిస్తుందన్నారు. కాబట్టి ఈ అంశాలపై ట్రంప్ మాట్లాడే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.