మోడీకి ఊరట, రాహుల్ గాంధీ అబద్దాలకు సుప్రీం కోర్టు చెంపదెబ్బ: రాఫెల్ డీల్పై అమిత్ షా
Recommended Video
ఢిల్లీ: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు పైన దర్యాఫ్తు జరపాలని వేసిన పిటిషన్లను భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు శుక్రవారం కొట్టివేసింది. రాఫెల్ వివాదంపై ఎలాంటి విచారణ అవసరం లేదని, దాంట్లో జోక్యం చేసుకోవాల్సిన ఎటువంటి కోణం లేదని న్యాయస్థానం పేర్కొంది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఈ విషయంలో విమర్శలు చేస్తోంది. సుప్రీం తీర్పు రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు.
ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా ట్విట్టర్ ద్వారా స్పందించారు. నిజం ఎప్పటికీ విజయం సాధిస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ రాజకీయ లబ్ధి కోసం రాఫెల్ డీల్ విషయంలో తప్పుడు సమాచారాన్ని ఉద్దేశ్యపూర్వకంగా పెద్ద ఎత్తున ప్రచారం చేశారని చెప్పారు. రాఫెల్ డీల్ విషయంలో సుప్రీం కోర్టులో పిటిషన్ వేసినప్పటికీ న్యాయస్థానానికి ఎక్కడ కూడా తప్పుడు అంశాలు కనిపించలేదని, అలాగే ఏ ఒక్క కంపెనీకి ఆర్థిక ప్రయోజనాల కోసం చేసినదిగా కనిపించలేదని కాంగ్రెస్ పార్టీకి కౌంటర్ ఇచ్చారు.
రాహుల్ గాంధీ అబద్దాలకు సుప్రీం కోర్టు చెంపదెబ్బ
ఆఫ్సెట్ భాగస్వాముల విషయంలో ప్రభుత్వానికి సంబంధం లేదని కోర్టు గుర్తించిందని, అలాగే అసలు విచారణ చేయాల్సిన అవసరం కూడా లేదని పేర్కొందని అమిత్ షా తెలిపారు. భారతదేశం కోసం చేసే కీలక ఒప్పందాలపై అనవసర రాద్ధాంతం చేసే వారికి ఇది చెంపపెట్టు అని కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి అమిత్ షా పేర్కొన్నారు. ఎస్సీ నెయిల్స్ రాగా (రాహుల్ గాంధీ) లైస్ (#SCNailsRaGaLies) అనే హ్యాష్ ట్యాగ్తో అమిత్ షా ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ అబద్దాలకు సుప్రీంలో ఎదురుదెబ్బ అని అభిప్రాయపడ్డారు.
రాఫెల్ వివాదంలో మోడీకి ఊరట.. సుప్రీంకోర్టు ఏమందో తెలుసా?
అవకతవకల పిటిషన్లు కొట్టివేత
కాగా, రాఫేల్ ఒప్పందంపై సుప్రీం కోర్టులో కేంద్ర ప్రభుత్వానికి ఊరట లభించిన విషయం తెలిసిందే. ఫ్రాన్స్ నుంచి 36 రాఫేల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్న కేంద్రానికి సుప్రీం కోర్టు క్లీన్చిట్ ఇచ్చింది. రాఫేల్ ఒప్పందంలో అవకతవకలు జరిగాయని, వీటిపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలంటూ దాఖలైన అన్ని పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది.
భారత దేశ భద్రత దృష్ట్యా కొన్ని అంశాల్లో గోప్యత
రాఫేల్ డీల్ ప్రక్రియలో అనుమానించదగిన అంశాలేమీ లేవని చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తెలిపింది. ఏ దేశానికైనా యుద్ధ విమానాలు అవసరమని, భారత వైమానిక దళంలోకి నాలుగు, అయిదో తరం యుద్ధ విమానాలను చేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోర్టు పేర్కొంది. దేశ భద్రత దృష్ట్యా కొన్ని అంశాల్లో గోప్యత పాటించాల్సి వస్తుందని గుర్తు చేసింది. రఫేల్ ఒప్పంద నిర్ణయ విధానం, ధరల వ్యవహారం, అంతర్జాతీయ ఒప్పందం వంటి అంశాల్లో కోర్టు జోక్యం చేసుకునేందుకు ఎలాంటి కారణాలు కనిపించడం లేదని తెలిపింది.
అప్పుడు లేదు, ఆ తర్వాతే
ఈ ఒప్పందం 2016 సెప్టెంబర్లో జరిగినప్పుడు ఎలాంటి అనుమానాలు రాలేదని, కేవలం ఫ్రాన్స్ మాజీ అధ్యక్షులు హోలన్ వ్యాఖ్యలు చేసిన తర్వాతే దీనిపై వివాదం మొదలైందని న్యాయస్థానం పేర్కొంది. ఆయన చేసిన వ్యాఖ్యలను న్యాయ విచారణకు స్వీకరించలేదని తెలిపింది. ఈ ఒప్పందంలో ప్రయివేటు సంస్థకు బిజినెస్ లబ్ధి చేకూర్చేలా ఎలాంటి సాక్ష్యాలు లేవని తెలిపింది. రాఫెల్ ఒప్పందంతో కేంద్రం కుంభకోణానికి పాల్పడిందని చాలాకాలంగా కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాఫేల్ యుద్ధవిమానాల ఒప్పందంపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తునకు ఆదేశించాలంటూ యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీ, లాయర్ ఎంఎల్ శర్మ తదితరులు సుప్రీంలో పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని బెంచ్ నవంబర్ 14న తీర్పును రిజర్వ్లో ఉంచింది. ఇప్పుడు తీర్పు ఇచ్చింది.