ఉద్వాసన పలకడంపై సచిన్ పైలట్ రియాక్షన్: ఓడించలేరంటూ: ట్విట్టర్ అకౌంట్ బయోలో మార్పులు
జైపూర్: రాజస్థాన్ రాజకీయాల్లో చెలరేగిన సంక్షోభ తుఫాన్.. ఎలాంటి అనూహ్య పరిణామాలను మిగల్చలేదు. కాంగ్రెస్ పార్టీ తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడంలో సక్సెస్ అయింది. కాంగ్రెస్ పార్టీని చీల్చడానికి పార్టీ సీనియర్ నేత, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సచిన్ పైలట్ చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. పైగా ఎదురు తిరిగాయి. తనకు 30 మంది ఎమ్మెల్యేల బలం ఉందంటూ మొదట్లో సచిన్ ప్రకటించుకున్నప్పటికీ.. ఆ సంఖ్య గణనీయంగా తగ్గింది.
పతనం అంచున కాంగ్రెస్ సర్కార్: 30 మంది ఎమ్మెల్యేలతో బీజేపీలో సచిన్ పైలట్: జేపీ నడ్డాతో
కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ భేటీతో ఆ పార్టీ బలమేంటో తేటతెల్లమైంది. సచిన్ పైలట్కు మద్దతు పలుకుతోన్న ఎమ్మెల్యేల సంఖ్య తగ్గడానికి కారణమైంది. పార్టీలో తిరుగుబాటును లేవనెత్తిన సచిన్ పైలట్పై కఠిన చర్యలకు దిగింది కాంగ్రెస్ పార్టీ. సీఎల్పీ భేటీ ముగిసిన మరుసటి రోజే ఆయనపై చర్యలను తీసుకుంది. ఉప ముఖ్యమంత్రి హోదాను తొలగించింది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ బాధ్యతల నుంచి తప్పించింది. ఆయనకు ఉద్వాసన పలికింది. సచిన్ పైలట్ స్థానంలో గోవింద్ సింగ్ దోతస్త్రాను నియమించింది.
తనకు ఉద్వాసన పలకడంపై సచిన్ పైలట్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేశారు. నిజాన్ని ఇబ్బందులకు గురి చేయవచ్చేమో గానీ.. ఓడించలేరంటూ ట్వీట్ చేశారు. సచిన్ పైలట్ను ఉప ముఖ్యమంత్రి స్థానం నుంచి తొలగించడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రణ్దీప్ సుర్జేవాలా గవర్నర్ను కలవడం, వెంటనే ఆయన దీన్ని అంగీకరించడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ వెంటనే పైలట్ తన స్పందనను వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.
सत्य को परेशान किया जा सकता है पराजित नहीं।
— Sachin Pilot (@SachinPilot) July 14, 2020
తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో అంతకుముందు వరకూ ఉన్న తన వ్యక్తిగత వివరాల్లో కూడా మార్పులు చేర్పులు చేశారు. ఇదివరకు రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రిగా, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్న తన వివరాలను తొలగించారు. ఎమ్మెల్యేగా, ఐటీ శాఖ మాజీమంత్రిగా తనను తాను పేర్కొన్నారు. టోంక్ అసెంబ్లీ నియోజకవర్గానికి సచిన్ పైలట్ ప్రాతినిథ్యాన్ని వహిస్తున్నారు. ఈ తిరుగుబాటు ఫలించకపోవడంతో ఇక ఆయన ఎమ్మెల్యేగా మాత్రమే మిగిలిపోవాల్సి వచ్చింది.