Coronavirus: భారతీయులు, విద్యార్థులను తరలించడానికి చైనాకు ప్రత్యేక విమానం
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్కు పుట్టినిల్లుగా భావిస్తోన్న వుహాన్ సిటీలో నివసిస్తోన్న ప్రవాస భారతీయులు, విద్యార్థులను స్వదేశానికి తీసుకుని రావడానికి కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా- ఓ ప్రత్యేక విమానాన్ని వుహాన్ సిటీకి పంపించడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణియన్ జైశంకర్ తెలిపారు. దీనికోసం బీజింగ్లోని భారత రాయబార కార్యాలయంతో నిరంతరంగా సంప్రదింపులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
హ్యుబే ప్రావిన్స్, వుహాన్ సిటీలో 250కి మందికి పైగా భారతీయులు నివసిస్తున్నారని, వారిలో ఎక్కువమంది విద్యార్థులేనని ఆయన తెలిపారు. హ్యుబే ప్రావిన్స్, వుహాన్ సిటీ సహా ఎక్కడెక్కడ వారు నివసిస్తున్నారనే విషయంపై చైనా రాయబార కార్యాలయం నుంచి సమగ్ర సమాచారాన్ని తెప్పించుకున్నామని అన్నారు. దీనికి సంబంధించిన ప్రక్రియ పూర్తి కాగానే.. ఓ ప్రత్యేక విమానాన్ని వుహాన్ సిటీకి పంపిస్తామని చెప్పారు.
చైనాలో నివసిస్తోన్న ఏ ఒక్క భారతీయుడు కూడా ఈ ప్రమాదకర కరోనా వైరస్ బారిన పడి ఉండరని తాను భావిస్తున్నట్లు జైశంకర్ చెప్పారు. వుహాన్ సిటీతో పాటు భారతీయులు నివసిస్తోన్న ఇతర ప్రాంతాల్లో కూడా కరోనా వైరస్ ప్రభావం ఏ విధంగా ఉందనే విషయంపై ఆరా తీస్తున్నామని అన్నారు. అక్కడి పరిస్థితి తీవ్రతను బట్టి.. తదుపరి నిర్ణయాలను తీసుకుంటామని చెప్పారు. వుహాన్ సిటీ నుంచి భారతీయులను స్వదేశానికి తరలించడంపైనే ప్రస్తుతం తాము దృష్టి సారించామని అన్నారు.
Recommended Video
విదేశాల నుంచి స్వదేశానికి చేరుకుంటున్న భారతీయులను పరీక్షించడానికి దేశంలోని దాదాపు అన్ని ప్రధాన విమానాశ్రయాల్లో థర్మల్ స్క్రీనింగ్ పరికరాలను అమర్చిన విషయాన్ని జైశంకర్ గుర్తు చేశారు. ప్రత్యేకించి- చైనా నుంచి స్వదేశానికి చేరుకుంటున్న భారతీయులకు సంబంధించిన సమాచారాన్ని పౌర విమానాయాన మంత్రిత్వ శాఖ అధికారులతో విదేశాంగ శాఖ అధికారులు ఇచ్చిపుచ్చుకుంటున్నారని అన్నారు. ఈ రెండు శాఖలు సమన్వయంతో పని చేస్తున్నాయని చెప్పారు.