ప్రళయం ముంచుకొస్తుందా! : తమిళనాట 'సునామీ' టెన్షన్
గతంలో ప్రపంచ దేశాలను వణికించిన సునామీ కూడా డిసెంబర్లోనే రావడం (2004లో), గతేడాది డిసెంబర్ లోను చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, కడలూరు జిల్లాలను వరదలు వణికించిన నేపథ్యంలో.. డిసెంబర్ వస్తుందంటే చాలు.. భ
చెన్నై : తమిళనాడులోని సముద్రతీర ప్రాంత ప్రజలను సునామీ భయం బెంబేలెత్తిస్తోంది. తీర ప్రాంతాల్లో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతుండడంతో.. ఏ క్షణాన ఎలాంటి ప్రళయం ముంచుకొస్తుందోనని స్థానిక ప్రజలు దినదిన గండంగా కాలం వెళ్లదీస్తున్నారు.
గతంలో ప్రపంచ దేశాలను వణికించిన సునామీ కూడా డిసెంబర్లోనే రావడం (2004లో), గతేడాది డిసెంబర్ లోను చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, కడలూరు జిల్లాలను వరదలు వణికించిన నేపథ్యంలో.. డిసెంబర్ వస్తుందంటే చాలు.. భయంతో ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని బ్రతుకుతున్నారు అక్కడి జనం.
ప్రస్తుతం రామేశ్వరం జిల్లాలోని సముద్ర తీర ప్రాంత ప్రజలంతా రాకాసి అలల బెడదకు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. జాలర్లు సైతం చేపల వేటకు వెళ్లకుండా ఇంటికే పరిమితమైపోతున్నారు. గురువారం నాడు సముద్రంలో మొదలైన అలజడి శుక్రవారం నాడు కూడా కొనసాగడంతో.. పరిస్థితి ఎక్కడ తీవ్ర రూపం దాలుస్తుందోనన్న భయాందోళన జనాల్లో నెలకొంది.
పాంబనలో రైల్వే వంతెనను సైతం అలలు ముంచెత్తుతుండడంతో.. ముందు జాగ్రత్త చర్యలకు రంగంలోకి దిగారు రైల్వే అధికారులు. ఇక ఇదే పరిస్థితి మరో రెండు రోజుల పాటు కొనసాగుతుందంటూ వాతావరణశాఖ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. జాలర్లు చేపల వేటకు వెళ్లరాదని సూచించారు అధికారులు. మొత్తానికి డిసెంబర్ మాసం వచ్చిందంటే తమళినాట తీరప్రాంత ప్రజలను సునామీ భయం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.