అందుకే కొత్త పార్టీ, ఆ ఇద్దరి బండారం బట్టబయలు చేస్తా: టీటీవీ దినకరన్
Recommended Video
చెన్నై: తమిళనాట రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఒకవైపు సినీ నటులు రజనీకాంత్, కమల్ హాసన్ రాజకీయాల్లోకి వచ్చేందుకు వేగంగా సన్నాహాలు చేస్తుండగా.. మరోవైపు శశికళ వర్గం కూడా సొంత కుంపటి పెట్టేదిశగా అడుగులు వేస్తోంది.
ఇటీవల ప్రతిష్టాత్మకంగా జరిగిన ఆర్కే నగర్ ఉప ఎన్నికలో ఘనవిజయం సాధించిన టీటీవీ దినకరన్ సొంత పార్టీ పెట్టే దిశగా వేగంగా కదులుతున్నారు. తన మద్దతుదారులతో చర్చించి త్వరలోనే కొత్త పార్టీని ప్రకటిస్తానని తాజాగా బుధవారం దినకరన్ వెల్లడించారు.
పార్టీని, గుర్తును కాపాడుకోవడానికే పార్టీ...
అన్నాడీఎంకే పార్టీని, రెండాకుల గుర్తును కాపాడుకోవడానికే కొత్త పార్టీని పెట్టాలని భావిస్తున్నట్టు టీటీవీ దినకరన్ తెలిపారు. రెండాకుల గుర్తును కచ్చితంగా సొంతం చేసుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
90 శాతం అన్నాడీఎంకే కేడర్ నావైపే...
అన్నాడీఎంకేకు చెందిన 90 శాతం కేడర్ తనవైపే ఉందని టీటీవీ దినకరన్ ధీమా వ్యక్తం చేశారు. అందువల్ల రాబోయే రోజుల్లో తమిళనాడులో కచ్చితంగా తాను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని పేర్కొన్నారు..
వారికి తప్ప.. పార్టీలో అందరికీ స్థానం...
తాను పెట్టబోయే కొత్త రాజకీయ పార్టీలో ఓపీఎస్, ఈపీఎస్లకు తప్ప అందరికీ స్థానం ఉంటుందని టీటీవీ దినకరన్ వ్యాఖ్యానించారు. రజనీ, కమల్ ఎంట్రీ గురించి ప్రస్తావించగా.. సినిమా వారు ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చు, పార్టీలు పెట్టొచ్చు అని అన్నారు.
ప్రభుత్వం కూలిపోతుందంటూ జోస్యం...
తమిళనాడులో ప్రస్తుత ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని దినకరన్ జోస్యం చెప్పారు. ఓపీఎస్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే.. అన్నాడీఎంకేలోని స్లీపర్ సెల్స్ బయటకు వస్తారని తన మద్దతుదారులైన ఎమ్మెల్యేలను ఉద్దేశించి అన్నారు.
ఓపీఎస్, ఈపీఎస్ బండారం బట్టబయలు చేస్తా...
ప్రభుత్వం పడిపోయాక ఓపీఎస్, ఈపీఎస్ బండారం బట్టబయలు చేస్తానని టీటీవీ దినకరన్ హెచ్చరించారు. సీఎం ఓపీఎస్ ఎంత పెద్ద అవినీతి తిమింగలమో త్వరలోనే బయటపెడతానని ఆయన పేర్కొన్నారు.