సీఎం ఓటుకు రూ. 6 వేలు ఇచ్చినా గెలవలేరు, నాకే సాధ్యం, లోక్ సభ: టీటీవీ దినకరన్!
చెన్నై: ఆర్ కే నగర్ శాసన సభ ఉప ఎన్నికల్లో తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి వర్గం ఓటుకు రూ. 6, వేలు ఇచ్చినా విజయం సాధించడం సాధ్యం అయ్యేది కాదని జయలలిత నెచ్చలి శశికళ సమీప బంధువు టీటీవీ దినకరన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారని టీటీవీ దినకరన్ ధీమా వ్యక్తం చేశారు.
సోమవారం మీడియాతో మాట్లాడిన టీటీవీ దినకరన్ తమిళనాడు ప్రభుత్వం పనితీరుపై మండిపడ్డారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తమ పదవులు కాపాడుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వంకు బానిసలై, తమిళనాడు ప్రజల సమస్యలు పట్టించుకోకుండా కాలం వెల్లదీస్తున్నారని టీటీవీ దినకరన్ ఆరోపించారు. ఆర్ కే నగర్ శాసన సభ నియోజక వర్గం ప్రజలకు అమ్మ జయలలిత ఎంతో సేవ చేశారని టీటీవీ దినకరన్ గుర్తు చేశారు.
అమ్మ మరణంతో ఆమె వారసుడిగా తాను ఆర్ కే నగర్ నియోజక వర్గం ఉప ఎన్నికల్లో పోటీ చేశానని టీటీవీ దినకరన్ అన్నారు. తనకు పోటీగా అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ అభ్యర్థిని బరిలో దించారని, చివరికి ఓటర్ల దగ్గర ఛీకొట్టించుకున్నారని టీటీవీ దినకరన్ విమర్శించారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గం ఆర్ కే నగర్ ఓటర్లకు ఒక్కొక్కరికి రూ. 6, 000 ఇచ్చినా ఉప ఎన్నికల్లో విజయం సాధించడం సాధ్యం అయ్యేదికాదని టీటీవీ దినకరన్ జోస్యం చెప్పారు. ఆర్ కే నగర్ లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా విజయం తమదే అని టీటీవీ దినకరన్ ధీమా వ్యక్తం చేశారు.