జయ మృతి: టీటీవీ దినకరన్, దివాకరన్ ను అరెస్టు చేస్తారు: శశికళ ఫ్యామిలీకి వార్నింగ్!
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి మృతి గురించి రోజుకు ఒకరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, వారిని పోలీసులు కచ్చితంగా అరెస్టు చేసి జైలుకు పంపించే రోజు త్వరలోనే వస్తుందని ఆ రాష్ట్ర మత్య్సశాఖ మంత్రి, అన్నాడీఎంకే పార్టీ సీనియర్ నాయకుడు డి. జయకుమార్ హెచ్చరించారు.
శశికళ ఫ్యామిలీకి వార్నింగ్
జయలలిత విషయంలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న ఆర్ కే నగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్, శశికళ సోదరుడు దివాకరన్ ను కచ్చితంగా అరెస్టు చేస్తామని తమిళనాడు మంత్రి జయకుమార్ హెచ్చరించారు. ఇకనైనా నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలని టీటీవీ దినకరన్, దివాకరన్ కు మంత్రి జయకుమార్ వార్నింగ్ ఇచ్చారు.
అనుమానాలు ఉన్నాయి
జయలలితకు 75 రోజుల పాటు అపోలో ఆసుపత్రిలో చికిత్స చేశారని, చివరికి చికిత్స విఫలమై అమ్మ మరణించారని జయకుమార్ గుర్తు చేశారు. ఆసుపత్రిలో జయలలిత చికిత్స పొందుతున్న సమయంలో తీసిన ఫోటోలు, వీడియోలు బయటకు రాకపోవడంతో ప్రజలు ఇప్పటికే అనేక అనుమానాలు వ్యక్తం చేశారని మంత్రి జయకుమార్ అన్నారు.
విచారణ జరుగుతుంటే వాగుడా ?
జయలలిత మరణంపై ఉన్న అనుమానాలు బయటకు తియ్యడానికి తమిళనాడు ప్రభుత్వం మద్రాసు హైకోర్టు రిటైడ్ న్యాయమూర్తి ఆర్ముగస్వామి విచారణ కమిషన్ ఏర్పాటు చేసిందని మంత్రి జయకుమార్ అన్నారు. ఓ పక్క ఆర్ముగస్వామి కమిషన్ విచారణ చేస్తుంటే మరో వైపు మీరు ఎందుకు వాగుతున్నారని మంత్రి జయకుమార్ శశికళ కుటుంబ సభ్యులను ప్రశ్నించారు.
అక్కడ చెప్పండి
జయలలిత 2016 డిసెంబర్ 4వ తేదీ సాయంత్రం మరణించారని, అపోలో ఆసుపత్రి వర్గాలు మాత్రం డిసెంబర్ 5వ తేదీ మరణించారని ప్రకటించారని శశికళ సోదరుడు దివాకరన్ చెబుతున్నారని, ఆ విషయం జస్టిస్ ఆర్ముగస్వామి విచారణ కమిషన్ ముందు చెప్పాలని మంత్రి జయకుమార్ సూచించారు.
ప్రత్యేకంగా చెప్పాలా ?
2016 డిసెంబర్ 4వ తేదీ తాను అపోలో ఆసుపత్రిలో జయలలితను చూశానని, ఆ సమయంలో అమ్మకు ఈసీఎంఓ (Extra corporeal membrane oxygenation)ను అమర్చారని టీటీవీ దినకరన్ మీడియాకు చెప్పారని, ఆ విషయం ఆర్ముగస్వామి విచారణ కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలని మంత్రి జయకుమార్ డిమాండ్ చేశారు. ఆ విషయం టీటీవీ దినకరన్ కు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని మంత్రి జయకుమార్ మండిపడ్డారు.