వీకే శశికళ, టీటీవీ మద్దతుదారుల ఎన్నికల గుర్తు గిఫ్ట్ బాక్స్: 59 మంది పోటీ, మా సత్తా చూపిస్తాం !
న్యూఢిల్లీ: తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి. తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన టీటీవీ దినకరన్ కు సుప్రీం కోర్టులో ఊరటలభించింది. తమిళనాడులో లోక్ సభ ఎన్నకలు, శాసన సభ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న వీకే. శశికళ, టీటీవీ దినకరన్ అనుచరులు అందరీకి గిఫ్ట్ బాక్స్ గుర్తు రావడంతో శుక్రవారం ఆనందంలో మునిగిపోయారు.
అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన టీటీవీ దినకరన్ ఏఎంఎంకే పార్టీని స్థాపించాడు. ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో బెంగళూరు సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న వీకే. శశికళకు సమీప బంధువు అయిన టీటీవీ దినకరన్ ఆర కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఎవ్వరూ ఊహించని విదంగా భారీ మెజారిటీతో విజయం సాధించి ఎమ్మెల్యే అయ్యారు.
అన్నాడీఎంకే పార్టీ మీద తిరుగుబాటు చేసి టీటీవీ దినకరన్ కు మద్దతు ఇచ్చిన 18 మంది ఎమ్మెల్యేల మీద వేటు వేసిన తమిళనాడు స్పీకర్ ధనపాల్ వారిని ఎమ్మెల్యేలుగా అనర్హులు చేశారు. తమిళనాడులోని 39 లోక్ సభ నియోజక వర్గాలు, పుదుచ్చేరిలోని ఒక లోక్ సభ నియోజక వర్గాల ఎన్నికల్లో టీటీవీ దినకరన్ అనుచరులు పోటీ చేస్తున్నారు.
అదే విదంగా తమిళనాడులోని 18 శాసన సభ నియోజక వర్గాలలో జరుగుతున్న ఉప ఎన్నికల్లో టీటీవీ దినకరన్ అనుచరులు పోటీ చేస్తున్నారు. ఆర్ కే నగర్ లో పోటీ చేసిన టీటీవీ దినకరన్ కు ఎన్నికల కమిషన్ ప్రెషర్ కుక్కర్ సింబల్ కేటాయించింది.
లోక్ సభ, శాసన సభ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న తన మద్దతుదారులకు ప్రెషర్ కుక్కర్ సింబల్ కేటాయించాలని టీటీవీ దినకరన్ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. ఎన్నికల గుర్తు తాము కేటాయించలేమని, అది ఈసీ పరిదిలో ఉందని సుప్రీం కోర్టు చెప్పింది. అయితే టీటీవీ దినకరన్ పార్టీకి ఎన్నికల గుర్తు కేటాయించే విషయం పరిశీలించాలని సుప్రీం కోర్టు ఎన్నికల కమిషన్ కు సూచించింది.
టీటీవీ దినకరన్ ఏఎంఎంకే పార్టీ అర్జీని పరిశీలించిన ఎన్నికల కమిషన్ ఆ పార్టీ నుంచి లోక్ సభ, శాసన సభ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న 59 మందికి గఫ్ట్ బాక్స్ గుర్తును కేటాయించింది. తన మద్దతుదారులు అందరికీ ఒకే గుర్తు కేటాయించిన ఎన్నికల కమిషన్ కు టీటీవీ దినకరన్ శుక్రవారం ధన్యవాదాలు తెలిపారు.