షాకింగ్: ఈసికి రూ.1.30 కోట్ల లంచం ఇవ్వబోయి బుక్కైన దినకరన్, ఉక్కిరి బిక్కిరి
తమిళనాడు రాజకీయాల్లో మరో షాకింగ్. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో తాజాగా మరో సంచలనం వెలుగు చూసింది. అన్నాడీఎంకే పార్టీ గుర్తు రెండాకుల కోసం టిటివి దినకరన్ ఢిల్లీలో ఓ వ్యాపారవేత్తను ఆశ్రయించారని తెలుస్తోంది.
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో మరో షాకింగ్. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో తాజాగా మరో సంచలనం వెలుగు చూసింది. అన్నాడీఎంకే పార్టీ గుర్తు రెండాకుల కోసం టిటివి దినకరన్ ఢిల్లీలో ఓ వ్యాపారవేత్తను ఆశ్రయించారని తెలుస్తోంది. ఈసీకి లంచం ఇచ్చి ఆ గుర్తు దక్కించుకుందామనుకున్నారు.
ఈ మేరకు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో తనకు రెండాకులు గుర్తు వచ్చేలా ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారిని ఆశ్రయించారు దినకరన్. ఆయన ద్వారా ఈసీకి లంచం ఇవ్వాలనుకున్నారని వెలుగు చూసింది.
ఆర్ కే నగర్: ఐటీ దాడుల ఎఫెక్ట్: బెయిల్ కోసం మంత్రులు పరుగో పరుగు!
ఇందుకోసం దినకరన్ సదరు వ్యాపారికి రూ.1.30 కోట్లు ముట్ట చెప్పారు. దీంతో సదరు వ్యాపారి (మధ్యవర్తి) సుఖేష్ చందర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. దినకరన్పై కేసు నమోదు చేశారు. ఇది ఇప్పుడు తమిళ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. దీంతో దినకరన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
దినకరన్ ఉక్కిరిబిక్కిరి
ఇదిలా ఉండగా, అన్నాడీఎంకే (అమ్మ) పార్టీలో చోటుచేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాలు ఆ పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అవినీతి ఆరోపణల్లో మంత్రులు చిక్కుకోవడం, ఢిల్లీలో కేసు, దీంతో పదవులను కాపాడుకోవడం కోసం కొందరు మంత్రులు తిరుగుబాటు బావుటా ఎగురవేయడం తదితర కారణాలతో ఇబ్బంది పడుతున్నారు.
శశికళతో నేడు భేటీ
వీటిపై నేరుగా శశికళను కలిసి ఈ విషయాలను చర్చించడంతోపాటు ఆమె సలహాలు కూడా తీసుకోవడానికి టీటీవీ దినకరన్ బెంగళూరు వెళ్లనున్నారు. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సి విజయభాస్కర్ నివాసంలో ఐటీ అధికారులు సోదాలు చేసినప్పటి నుంచి దినకరన్కు చిక్కులు చుట్టుముట్టాయి. ఈ తనిఖీల కారణంగా ఆర్కేనగర్ ఉప ఎన్నికను ఎన్నికల కమిషన్ రద్దు చేసింది.
చిక్కులు
ముగ్గురు మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిపై పోలీసులు కేసు నమోదు కూడా చేశారు. ఈ పరిణామాలు ఆయన్ను ఇరకాటంలో పెడుతున్నాయి. మంత్రి విజయభాస్కర్ చుట్టూ ఐటీ ఉచ్చు బిగుస్తున్న నేపథ్యంలో సీబీఐ విచారణకు రంగం సిద్ధమవుతోందనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో విజయభాస్కర్ను మంత్రివర్గం నుంచి తొలగించి ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం సీఎం పళనిస్వామి, ఆయన మంత్రివర్గ ఇతర సహచరులు నిర్ణయించారని తెలుస్తోంది.
దినకరన్ వ్యతిరేకత
ఇందుకు టీటీవీ దినకరన్ మాత్రం తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేసినట్లుగా సమాచారం. తమ పదవులను కాపాడుకోవాలంటే విజయభాస్కర్ను మంత్రివర్గం నుంచి తప్పించడంతోపాటు ఆయనకు గట్టిగా మద్దతు పలుకుతున్న టీటీవీ దినకరన్నూ పార్టీ పదవి నుంచి తప్పించడానికి కొందరు మంత్రులు నిర్ణయించుకున్నారని తెలిసింది.
అందుకే చిన్నమ్మతో భేటీ
దీంతో శశికళను హఠాత్తుగా కలిసేందుకు దినకరన్ నిర్ణయించారని సమాచారం. ఈ నిమిత్తం ఆయన సోమవారం బెంగళూరుకు బయలుదేరారు. అయితే పార్టీ అధికార గుర్తుకు సంబంధించిన వ్యవహారంలో ఎన్నికల కమిషన్ దర్యాప్తు ప్రారంభం కానుందని, అందుకే ఆయన శశికళను కలిసేందుకు బెంగళూరు వెళ్తున్నారని మరికొందరు చెబుతున్నారు.