శశికళ పన్ను ఎగవేత రూ.5వేల కోట్లు: ఐటీ అధికారులకే షాక్, వారి పేరిట భారీ ఆస్తులు
చెన్నై: అన్నాడీఎంకే ప్రభుత్వం త్వరలో కుప్పకూలుతుందని ఆర్కే నగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ మరోసారి చెప్పారు. త్వరలో ఈ ప్రభుత్వం కూలడం ఖాయమని చెప్పారు. పళనిస్వామి గవర్నమెంట్ ఎక్కువ రోజులు ఉండదని ఆయన పదేపదే చెబుతున్న విషయం తెలిసిందే.
షాకింగ్: శశికళ రూంలో జయలలితకు రాసిన సీక్రెట్ లేఖ, కళ్లు చెదిరే ఆస్తులు
కాగా, శశికళ కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని ఇన్కం టాక్స్ అధికారులు ఏకకాలంలో భారీ స్థాయిలో సోదాలు నిర్వహించి నెలలు గడుస్తున్నా దాని తాలూకు ప్రకంపనలు మాత్రం కనిపిస్తున్నాయి. దొరికిన ఆధారాల మేరకు దర్యాప్తు జరుపుతున్న ఆదాయపు పన్ను అధికారులకు తవ్వేకొద్దీ అక్రమ ఆస్తుల చిట్టా వెలుగులోకి వస్తూనే ఉంది.
రూ.5 వేల కోట్ల పన్ను ఎగవేత
దీని ద్వారా పన్ను ఎగవేత రూ.5 వేల కోట్లకు చేరుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇది ఐటీ అధికారులనే ఆశ్చర్యానికి గురిచేస్తోంది. శశికళ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని గత ఏడాది నంబంరు 9న ఏకకాలంలో పలుచోట్ల ఐటీ సోదాలు జరిగిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 215 ప్రాంతాల్లో ఈ సోదాలు జరగ్గా అందులో చెన్నైలోనే 115 ప్రాంతాలు ఉన్నాయి.
క్షుణ్ణంగా దర్యాఫ్తు
13వ తేదీ వరకు అయిదు రోజులు జరిగిన ఈ సోదాల్లో రూ.1,450 కోట్ల మేర పన్ను ఎగవేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఆ తర్వాత జయలలిత నివాసమైన పోయెస్ గార్డెన్లోని వేద నిలయంలో సోదాలు జరిపి కంప్యూటరు హార్డ్ డిస్క్లు, ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. 20పైగా డొల్ల కంపెనీలు ఏర్పాటుచేసి వాటిద్వారా రూ.కోట్లలో నగదు బదలాయింపులు జరిగిన ఆధారాలను కూడా ఐటీ అధికారులు అప్పట్లో స్వాధీనం చేసుకున్నారు. వీటి ఆధారంగా ప్రస్తుతం దర్యాప్తు జరుపుతున్నారు.
వీరి పేరిట చాలా ఆస్తులు
ఈ పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు. వాటి ఆధారంగానే వివేక్, కృష్ణప్రియ, షకీల, పూంగుండ్రన్ తదితర పలువురిని విచారిస్తున్నారు. జయలలిత నివాసంలో స్వాధీనం చేసుకున్న పత్రాల ద్వారా పలు కీలక సమాచారం లభించినట్లుగా తెలుస్తోంది. శశికళ, ఇళవరసి, బంధువు కలియ పెరుమాళ్ పేరిట చాలా ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటివరకు పన్ను ఎగవేత రూ.4,600 కోట్ల వరకు ఉన్నట్లు తేల్చారని తెలుస్తోంది.
ఐటీ అధికారులు నివ్వెరపోయారు
లెక్కల్లోకి రాని అనేక ఆస్తులు, ఇతర పెట్టుబడులు కూడా వెలుగులోకి వచ్చాయని తెలుస్తోంది. తవ్వే కొద్దీ అక్రమాస్తులు, పన్ను ఎగవేత వెలుగులోకి వస్తుండటం ఐటీ అధికారులు నివ్వెర పోతున్నారని తెలుస్తోంది. అనారోగ్య కారణాలతో శశికళ సోదరుడు దివాకరన్ తదితరులు దర్యాప్తు అధికారుల సమక్షంలో హాజరుకాలేదు. పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిగితే మరిన్ని ఆక్రమాస్తులు, పన్ను ఎగవేత వ్యవహారాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. దీని ద్వారా శశికళ కుటుంబం అక్రమాస్తులు, పన్ను ఎగవేత రూ.5 వేల కోట్లకు చేరుతుందని అంటున్నారు. పటిష్ట నిఘాతోనే సోదాలు నిర్వహించారని తెలుస్తోంది.