పళనిస్వామి ప్రభుత్వాన్ని పడగొడతా!: దినకరన్ సంచలనం, గంటల్లో ట్విస్ట్
టిటివి దినకరన్ బుధవారం నాడు సంచలన ప్రకటన చేశారు. తనకు వ్యతిరేకంగా ఎవరూ లేరని, అన్నాడీఎంకేలో అందరూ తనకే మద్దతు పలుకుతున్నారని, అవసరమైతే పళనిస్వామి ప్రభుత్వాన్ని పడగొడతానని షాకింగ్ కామెంట్స్ చేశారు.
చెన్నై: టిటివి దినకరన్ బుధవారం నాడు సంచలన ప్రకటన చేశారు. తనకు వ్యతిరేకంగా ఎవరూ లేరని, అన్నాడీఎంకేలో అందరూ తనకే మద్దతు పలుకుతున్నారని, అవసరమైతే పళనిస్వామి ప్రభుత్వాన్ని పడగొడతానని షాకింగ్ కామెంట్స్ చేశారు.
చిన్నమ్మ కథ అడ్డం తిరిగింది!: పార్టీ చీఫ్ ఇప్పటికీ శశికళనే.. కానీ?
ఆయనను పలువురు ఎమ్మెల్యేలు కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తనకు పార్టీలో ఎవరు కూడా వ్యతిరేకంగా లేరని దినకరన్ అన్నారు. తాను తగిన సమయంలో నిర్ణయం ప్రకటిస్తానన్నారు. ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉందని చెప్పారు.
దినకరన్ ఆగ్రహం
అంతకుముందు, తమను పార్టీ నుంచి పంపించడంపై దినకరన్ ఒక్కసారిగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి అయిన తనకే తెలియకుండా, తన ఆదేశాలు లేకుండానే సమావేశం ఎలా నిర్వహించారంటూ కార్యాచరణ కమిటీ సభ్యులపై ఆయన నిప్పులు చెరిగారు. అడిగిన వారందరికీ మంత్రి పదవులు ఇచ్చానని, కోరిన కోరికలన్నీ తీర్చానని, అయినా ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు.
దీని వెనుక ఎవరున్నారు?
దీని వెనుక ఎవరున్నారు? ఎవరు నాయకత్వం వహిస్తున్నారు? ఇదంతా ఎందుకు చేయాల్సి వస్తోంది? అని దినకరన్ ప్రశ్నించారు. పార్టీ నుంచి మమ్మల్నే తొలగించాలనుకుంటారా? అంత దమ్ముందా? కొత్తగా కొమ్ములు మొలిచాయా? అంటూ దినకరన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలలో ఎక్కువ మంది తమవారే అని, ఆ విషయాన్ని మీరు మర్చిపోతున్నారని హెచ్చరించారు.
అన్నాడీఎంకేలో రసవత్తరం
కాగా, అన్నాడీఎంకేలో రసవత్తర రాజకీయం కనిపిస్తోన్న విషయం తెలిసిందే. పార్టీ, ప్రభుత్వం నుంచి తనకు ఉద్వాసన పలుకుతూ పళనిస్వామి మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నా దినకరన్ వెనక్కి తగ్గడం లేదు.
పార్టీపై తన పట్టును నిరూపించుకునేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా బుధవారం ఎమ్మెల్యేలతో భేటీ కావాలని నిర్ణయించుకున్నారు. ఆయనకు ఆరు నుంచి 20 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది.
ఒక్కటైన కాసేపటికే కీలక మలుపు
తమిళనాడు ముఖ్యమంత్రి పళనీస్వామి, మాజీ సీఎం పన్నీర్సెల్వం వర్గాల మధ్య రాజీ కుదిరి గంటలైనా కాకముందే దినకరన్ రంగంలోకి దిగడంతో అన్నాడీఎంకేలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఇప్పటివరకు రెండు వర్గాలుగా విడిపోయిన అన్నాడీఎంకే పునరేకీకరణ కోసం నేతల మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి.
దినకరన్ దూకుడు
పార్టీ నుంచి శశికళ, టీటీవీ దినకరన్ కుటుంబాన్ని పక్కనపెట్టాలని అందరి ఏకాభిప్రాయంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి జయకుమార్ వెల్లడించారు. అయితే ఈ నేపథ్యంలో చెన్నైలో దినకరన్తో ఆరు నుంచి పది మంది ఎమ్మెల్యేలు మంగళవారమే సమావేశమయ్యారు. ఇది ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలో బుధవారం దినకరన్ ఎమ్మెల్యేలతో భేటీ అవుతున్నారు.
పార్టీ నేతలతో స్టాలిన్ భేటీ
అన్నాడీఎంకేలో ఆసక్తికర పరిణామాల నేపథ్యంలో ప్రతిపక్ష నేత, డీఎంకే అధ్యక్షులు స్టాలిన్ పార్టీ నేతలతో భేటీ అయ్యారు. అధికార పార్టీలో జరుగుతున్న పరిణామాలపై చర్చించందుకు, ఏం చేయాలనే విషయమై చర్చించేందుకు భేటీ అయ్యారు.