ఆర్కె నగర్: దినకరన్ వైపే ఎగ్జిట్ పోల్ సర్వే మొగ్గు
చెన్నై: ప్రతిష్టాత్మకమైన ఆర్కె నగర్ ఉప ఎన్నికల్లో టీటీవి దినకరన్ విజయం సాధించే అవకాశాలున్నట్లు తమిళ టీవీ చానెల్స్ ఎగ్జిట్ పోల్ సర్వేలు తెలియజేస్తున్నాయి. బిజెపి పార్లమెంటు సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి కూడా అదే విషయం చెప్పారు
ఆర్కె నగర్లో దినకరన్ విజయం సాధిస్తారని కావేరీ టీవీ చానెల్ సర్వేలో తేలింది. ఆర్కే నగర్ ఉప ఎన్నికపై ఆ టీవీ చానెల్ సర్వే నిర్వహించింది. ఎగ్జిట్ పోల్ సర్వేలో 1071 మంది ఓటర్లు పాల్గొన్నారు. వారిలో 64 శాతం మంది పురుషులు కాగా, 36 శాతం మంది మహిళలు ఉన్నారు.
దినకరన్కు 37 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేయగా, అన్నాడియంకె అభ్యర్థి మదుసూదన్ 26 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలుస్తారని అంచనా వేసింది. డిఎంకె అభ్యర్థి మరుదు గణేష్ 18 శాతం ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. నామ్ తమిళార్ పార్టీ నాలుగో స్థానంలో, బిజెపి అభ్యర్థి కారు నాగరజన్ నాలుగో స్థానంలో నిలిచారు.
తమకు ఏ విధమైన డబ్బులు అందలేదని 90 శాతం మంది చెప్పగా, తమకు పార్టీలు తమకు డబ్బులు ఇచ్చాయని పది శాతం మంది చెప్పారు. తమకు డబ్బులు ఇచ్చిన అభ్యర్థులకు ఓటు వేయలేదని 97 శాతం మంది చెప్పగా, డబ్బులు ఇచ్చినవారికి వ్యతిరేకంగా ఓటు వేశామని 3 శాతం మంది చెప్పారు.
జయలలితకు చికిత్స అందిస్తున్న వీడియో తమపై ఏ విధమైన ప్రభావం చూపలేదని 95 శాతం మంది అభిప్రాయపడగా, దాని ప్రభావం కొంత ఉంటుందని 5 శాతం మంది అభిప్రాయపడ్డారు.