చెన్నైకి ఢిల్లీ పోలీస్: దినకరన్ అరెస్ట్కు రంగం? తప్పించుకునే యత్నాలు
అన్నాడీఎంకే పార్టీ రెండాకుల గుర్తు పొందేందుకు ఈసికి రూ.50 కోట్లు చెల్లించేందుకు ప్రయత్నాలు చేసిన టిటివి దినకరన్ను విచారించేందుకు ఢిల్లీ పోలీసులు మంగళారం చెన్నై చేరుకున్నారు. ఆయనను ఈ రోజు పోలీసులు విచ
చెన్నై: అన్నాడీఎంకే పార్టీ రెండాకుల గుర్తు పొందేందుకు ఈసికి రూ.50 కోట్లు చెల్లించేందుకు ప్రయత్నాలు చేసిన టిటివి దినకరన్ను విచారించేందుకు ఢిల్లీ పోలీసులు మంగళారం చెన్నై చేరుకున్నారు. ఆయనను ఈ రోజు పోలీసులు విచారించే అవకాశముంది.
రెండాకుల కోసం రూ.50 కోట్లు.. ఎలా బయటపడింది?: ఎవరీ దినకరన్?
ఢిల్లీకి చెందిన సుఖేష్కు ఇందుకోసం రూ.1.3 కోట్లు లంచం ఇచ్చినట్లుగా దినకరన్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సుఖేష్ నుంచి పోలీసులు ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకొని విచారించగా, అసలు విషయం వెలుగు చూసింది. దీంతో ఢిల్లీ పోలీసులు విచారించేందుకు చెన్నై వచ్చారు.
లాయర్లతో దినకరన్ చర్చలు
ఈసీకి లంచం వ్యవహారంలో పీకల్లోతు ఇబ్బందుల్లో కూరుకుపోయిన దినకరన్ తన లాయర్లతో చర్చిస్తున్నారు. ఏం చేయాలనే అంశంపై చర్చిస్తున్నారు. ముందస్తు బెయిల్ విషయమై, అలాగే అరెస్ట్ చేస్తే ఏం చేయాలనే అంశంపై చర్చించారు. మరోవైపు ఆయనను విచారించిన అనంతరం ఢిల్లీ పోలీసుల బృందం అరెస్ట్ చేసే అవకాశాలున్నాయనే ప్రచారం సాగుతోంది.
ఒక్కటయ్యే దిశగా అన్నాడీఎంకే
మరోవైపు, అన్నాడీఎంకేలోని రెండు వర్గాలు ఒక్కటి అయ్యే దిశగా పయనిస్తున్నాయి. తమిళనాడులో అన్నాడీఎంకే చీలిపోలేదని, తమ మధ్య ఉన్నవి కేవలం అభిప్రాయ భేదాలేనని ఆ పార్టీ సీనియర్ నేత, లోకసభ ఉప సభాపతి తంబిదురై పేర్కొన్నారు.
సోమవారం సాయంత్రం సచివాలయంలో ముఖ్యమంత్రి పళనిస్వామితో భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. వారడిగిన ప్రశ్నకు సమాధానంగా.. అన్నాడీఎంకే చీలిపోలేదని, పార్టీని కాపాడుకోవడానికి అంతా ఏకమవడానికి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.
అర్ధరాత్రి మంతనాలు
సోమవారం అర్థరాత్రి సీనియర్ మంత్రులు విద్యుత్తు శాఖ మంత్రి కె తంగమణి నివాసంలో ఆకస్మిక భేటీ నిర్వహించారు. అధికార పార్టీ శాసనసభ్యులంతా మంగళవారం చెన్నైలో అందుబాటులో ఉండాలని నేతలు సూచించారు. జయలలిత కన్నుమూసిన తర్వాత అన్నాడీఎంకే పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది.
దినకరన్పై కేసు ఎఫెక్ట్
ఒక వర్గానికి వి.కె.శశికళ/ టీటీవీ దినకరన్, మరో వర్గానికి మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీరుసెల్వం నాయకత్వం వహిస్తున్నారు. అర్థరాత్రి భేటీకి హాజరుకాకపోయినా సోమవారం ఉదయం పన్నీరుసెల్వం తన సహచరులతో సమాలోచనలు జరిపారు.
విలీనంపై చర్చల గురించి ఆయన మాట్లాడాక మంత్రుల సమాలోచనలు మొదలయ్యాయి. అంతకుముందు లోకసభ ఉప సభాపతి ఎం తంబిదురై మాట్లాడుతూ పెన్నీరుసెల్వంతో సయోధ్య కోసం చర్చలకు దినకరన్ వర్గం సిద్ధమేనన్నారు. దినకరన్పై ఢిల్లీలో కేసు నేపథ్యంలో తమిళ రాజకీయాలు అనూహ్య మలుపు తిరుగుతున్నాయి.