బెంగళూరు జైల్లో శశికళతో టీటీవీ, 18 మంది అనర్హత ఎమ్మెల్యేలు భేటీ, సర్కార్ పై డ్రామాలు !
బెంగళూరు: జయలలితకు చెందిన ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో బెంగళూరు పర్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న చిన్నమ్మ వీకే శశికలతో చెన్నైలోని ఆర్ కే నగర్ ఎమ్మెల్యే, అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం పార్టీ చీఫ్ టీటీవీ దినకరన్, 18 మంది అనర్హత ఎమ్మెల్యేలు శుక్రవారం భేటీ అయ్యారు.
మా భవిష్యత్తు ఏమిటి ?
టీటీవీ దినకరన్ తో పాటు ఇటీవల అనర్హతకు గురైన 18 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు (మాజీలు) సైతంశశికళతో భేటీ అయ్యి వారి భవిష్యత్తు కార్యచరణపై చర్చించారు. శశికళతో భేటీ అయిన తరువాత టీటీవీ దినకరన్ పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు బయట మీడియాతో మాట్లాడారు.
సుప్రీం కోర్టులో సవాలు
అనర్హతకు గురైన 18 మంది ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టును ఆశ్రయించాలని నిర్ణయం తీసుకున్నారని శశికళకు చెప్పామని టీటీవీ దినకరన్ అన్నారు. మద్రాసు హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చెయ్యడం మంచిదే అని, వెంటనే ఆ విషయంపై న్యాయనిపుణులతో చర్చించాలని శశికళ సూచించారని టీటీవీ దినకరన్ అన్నారు.
పోయెస్ గార్డెన్ లో ఐటీ దాడులు
గత సంవత్సరం ఆదాయపన్ను శాఖ అధికారులు పోయెస్ గార్దెన్ లోని జయలలిత ఇంటిలో సోదాలు చేసిన విషయాన్ని టీటీవీ దినకరన్ గుర్తు చేశారు. ఆ సందర్బంలో తమిళనాడు మంత్రులు, అన్నాడీఎంకే పార్టీ నాయకులు ఐటీ దాడులకు నిరసనగా ఎలాంటి ధర్నాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించలేదని టీటీవీ దినకరన్ ఆరోపించారు.
సర్కార్ సినిమాపై రచ్చ
విజయ్ హీరోగా నటించిన సర్కార్ సినిమాలో జయలలితను కించపరిచారని, తమిళనాడు ప్రభుత్వాన్ని ఎద్దేవ చేస్తున్నారని ఆరోపిస్తూ ఇప్పుడు మంత్రులు, కార్యకర్తలు రోడ్డు ఎక్కడం విడ్డూరంగా ఉందని, వీరి తీరుపై ప్రజలు నవ్వుకుంటున్నారని టీటీవీ దినకనరన్ ఆరోపించారు.
ఉప ఎన్నికల్లో పోటి
తమిళనాడులోని అన్నాడీఎంకే ప్రభుత్వం ప్రజల కష్టాలను తీర్చడంలో పూర్తిగా విఫలం అయ్యిందని టీటీవీ దినకరన్ ఆరోపించారు. 18 నియోజక వర్గాల్లో ఉప ఎన్నికలు జరిగితే అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యేలు అందరూ పోటీ చేస్తారని, అన్నాడీఎంకే పార్టీ అభ్యర్థులను ఇంటికి పంపిస్తామని టీటీవీ దినకరన్ తమిళనాడు ప్రభుత్వానికి సవాలు విసిరారు.