మోడీకి వ్యతిరేకంగా మన్నార్ గూడి మాఫియా మీటింగ్: కష్టాలు కొని తెచ్చుకుంటున్నారా ?
చెన్నై: కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంతో కలిసి తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి నాటకాలు ఆడుతూ తమిళనాడు విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని టీటీవీ దినకరన్ ఆరోపించారు.
ఆదివారం చెన్నైలో నీట్ పరీక్షకు వ్యతిరేకంగా నిర్వహించిన ధర్నాలో టీటీవీ దినకరన్ పాల్గొన్నారు. తమిళ ప్రజలు, ఇక్కడి విద్యార్థుల మనోభావాలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. నీట్ పరీక్షను తమిళనాడుకు మినహాయించాలని మనవి చేసినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని టీటీవీ దినకరన్ అన్నారు.
తమిళనాడు విద్యార్థుల మనోభావాలను కేంద్ర ప్రభుత్వం ముందు వివరించడంలో ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని, కేవలం ఆయన పదవులు కాపాడుకోవడం కోసమే ప్రయత్నిస్తున్నారని టీటీవీ దినకరన్ తీవ్రస్థాయిలో విమర్శించారు.
కేంద్రం, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్షం కారణంగా దళిత విద్యార్థి అనిత ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని టీటీవీ దినకరన్ ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఈనెల 16వ తేదీన తిరుచిరాపల్లి (తిరుచ్చి)లో తాను ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొనాలని తన మద్దతుదారులకు టీటీవీ దినకరన్ పిలుపునిచ్చారు.