రిసార్ట్ లో దినకరన్ గ్రూప్ ఎమ్మెల్యేలు: చెప్పులతో కొట్టిన మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రక్షణ !
అన్నాడీఎంలో మళ్లీ రచ్చ మొదలైయ్యింది. పుదుచ్చేరి మాజీ శాసన సభ్యుడు ఓం శక్తి సాగర్ టీటీవీ దినకరన్, శశికళ మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
పుదుచ్చేరి: అన్నాడీఎంలో మళ్లీ రచ్చ మొదలైయ్యింది. పుదుచ్చేరి మాజీ శాసన సభ్యుడు ఓం శక్తి సాగర్ టీటీవీ దినకరన్, శశికళ మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శశికళ, టీటీవీ దినకరన్ ఫ్లెక్సీలను చెప్పులతో కొట్టి రిసార్ట్ లో బస చేసిన ఎమ్మెల్యేలు వెంటనే వెళ్లిపోవాలని రిసార్ట్ ముందు ఆందోళనకు దిగారు.
తమిళనాడు సీఎంగా కొత్త పేరు తెరమీదకు, కాలర్ ఎగరేస్తున్న టీటీవీ దినకరన్, పళని, పన్నీర్ !
పుదుచ్చేరి నగరానికి 20 కిలో మీటర్ల దూరంలోని చిన్నవీరంపట్టినం ప్రాంతంలో సముద్ర తీరంలోని గ్రామంలో ఉన్న ద వైండ్ ఫ్లవర్ రిసార్ట్ స్పాలో మంగళవారం నుంచి టీటీవీ దినకరన్ వర్గంలోని ఎమ్మెల్యేలు బసచేశారు. బుధవారం మాజీ శాసన సభ్యుడు (అన్నాడీఎంకే) ఓం శక్తి సాగర్ తన అనుచరులతో కలిసి రిసార్ట్ దగ్గరకు వెళ్లారు.
నో ఎంట్రీ అంటూ అడ్డుకున్నారు
ద వైండ్ ఫ్లవర్ రిసార్ట్ స్పా లోకి ప్రవేశించడానికి మాజీ ఎమ్మెల్యే ఓం శక్తి సాగర్ తో పాటు ఆయన అనుచరులు ప్రయత్నించారు. అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డులు అడ్డుకోవడంతో ఓం శక్తి సాగర్ మండి పడ్డారు. రిసార్ట్ ముందు శశికళ, టీటీవీ దినకరన్ ఫ్లెక్సీలను చెప్పులతో కొట్టి నిరసన వ్యక్తం చేశారు.
అమ్మ శ్రమను నాశనం చేస్తున్నారు
జయలలిత అధికారంలోకి తెచ్చిన అన్నాడీఎంకే పార్టీని శశికళ, దినకరన్ కుటుంబ సభ్యులు నాశనం చేస్తున్నారని ఓం శక్తి సాగర్ ఆరోపించారు. తమిళనాడులో గొడవలు చాలదని ఇప్పుడు పుదుచ్చేరికి వచ్చి ఇక్కడ అన్నాడీకేం నాయకులు, కార్యకర్తల మధ్య గొడవలు పెడుతున్నారని మండిపడ్డారు.
అందరూ ఒకే సారి ఎందుకు ?
రిసార్ట్ లో 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని అంటున్నారని, అంత మంది ఎమ్మెల్యే ఒక్క సారిగా పుదుచ్చేరి వచ్చి రిసార్ట్ రాజకీయాలు చెయ్యాల్సిన అవసరం ఏమి వచ్చిందని ఓం శక్తి సాగర్ ప్రశ్నించారు. వెంటనే ఎమ్మెల్యేలు అందరూ పుదుచ్చేరి వదిలి వెళ్లిపోవాలని ఆయన డిమాండ్ చేశారు.
దినకరన్ వలన శాంతి భద్రతలకు భంగం
దినకరన్ గ్రూప్ ఎమ్మెల్యేలు ఇక్కడే ఉంటే పుదుచ్చేరిలో గొడవలు చెలరేగుతాయని, శాంతి భద్రతల సమస్యలు ఎదురౌతాయని, వెంటనే వారిని రిసార్ట్ నుంచి బయటకు పంపించాలని పుదుచ్చేరి కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేస్తామని ఓం శక్తి సాగర్ అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రక్షణ
పుదుచ్చేరిలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దినకరన్ వర్గం ఎమ్మెల్యేలకు రక్షణ కల్పిస్తోందని, తమిళనాడులో అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని కుప్పకూల్చడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ఓం శక్తి సాగర్ ఆరోపించారు. ముందు జాగ్రత చర్యగా రిసార్ట్ దగ్గర స్థానిక పోలీసులు గట్టిబందోబస్తు ఏర్పాటు చేశారు.