చిన్నమ్మ శశికళ మిడాస్ లిక్కర్ కంపెనీతో లింక్ లేదు: ఆర్ కే నగర్ ఎమ్మెల్యే, తెలీదు!
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేకపోతున్నారు. అమ్మ జయలలిత ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న శశికళ కుటుంబ సభ్యులు ఇప్పుడు రోజుకో మాట మాట్లాడుతున్నారు.
శశికళకు చెందిన మిడాస్ మద్యం కంపెనీతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెన్నైలోని ఆర్ కే నగర్ నియోజక వర్గం ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ బాంబు పేల్చాడు. సోమవారం మీడియాతో మాట్లాడిన టీటీవీ దినకరన్ మిడాస్ మద్యం కంపెనీలో తనకు ఎలాంటి వాటా లేదని అన్నారు.
శశికళ కుటుంబ సభ్యులకు చెందిన మిడాస్ మద్యం కంపెనీ కొన్ని వేల కోట్ల రూపాయల లావాదేవీలు నిర్వహిస్తోంది. తమిళనాడు ప్రభుత్వం నిర్వహిస్తున్న మద్యం దుకాణాలకు భారీ మొత్తంలో మిడాస్ కంపెనీ మద్యం సరఫరా చేస్తోంది.
జయలలిత మరణించడం, శశికళ జైలుకు వెళ్లడం, పన్నీర్ సెల్వం, పళనిస్వామి వర్గం ఒక్కటి కావడంతో మిడాస్ కంపెనీకి కష్టకాలం మొదలైయ్యింది. మిడాస్ కంపెనీకి చెందిన మద్యం బ్రాండ్ల సరఫరాకు తమిళనాడు ప్రభుత్వం కత్తెర వేసింది.
గత ఏడాదిలో ఆదాయపన్ను శాఖ అధికారులు శశికళ కుటుంబ సభ్యులను లక్షంగా చేసుకుని దాడులు చేశారు. ఆ సమయంలో మిడాస్ మద్యం కంపెనీ మీద ఐటీ దాడులు జరిగాయి. మిడాస్ మద్యం కంపెనీలో టీటీవీ దినకరన్ కు వాటాలు ఉన్నాయని ప్రచారం జరుగుతున్న సమయంలో ఆయన క్లారిటీ ఇచ్చారు.