శశికళ ఎఫెక్ట్: డీఐజీ రూప ఇంటర్వూలు ఆపండి: కర్ఱాటక సీఎంకు లేఖ, ఇదో కొత్త వార్నింగ్ !
అన్నాడీఎంకే పార్టీ (అమ్మ) తాత్కాలిక ప్రధాన కార్యదర్శి వీకే. శశికళ నటరాజన్ కు వ్యతిరేకంగా ట్రాఫిక్ విభాగం డీఐజీ రూప మీడియాకు ఇంటర్వూలు ఇస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారని.
బెంగళూరు: అన్నాడీఎంకే పార్టీ (అమ్మ) తాత్కాలిక ప్రధాన కార్యదర్శి వీకే. శశికళ నటరాజన్ కు వ్యతిరేకంగా ట్రాఫిక్ విభాగం డీఐజీ రూప మీడియాకు ఇంటర్వూలు ఇస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారని, మీరు అడ్డుకట్ట వెయ్యాలని ఆమె వర్గంలోని నాయకుడు పూహళేంది కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు లేఖ రాశారు.
ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శశికళ శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. కర్ణాటక జైళ్ల శాఖ డీఐజీ హోదాలో రూప ఇటీవల పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో తనిఖీలు చేశారు.
ఫోటోలు బయటకు, రచ్చ రచ్చ
శశికళతో పాటు, నకిలి స్టాంప్ పత్రాల కుంభకోణంలో జైల్లో శిక్ష అనుభవిస్తున్న కరీంలాల్ తెల్గీకి వీవీఐపీ ట్రిట్ మెంట్ ఇస్తున్నారని ఆరోపిస్తూ రూప తన పై అధికారులు, ప్రభుత్వానికి లేఖ రాశారు. శశికళ శిక్ష అనుభవిస్తున్న గదుల్లో ఖరీదైన వస్తువులు ఉన్న ఫోటోలు బయటకు రావడంతో రచ్చరచ్చ అయ్యింది.
Recommended Video
వీడియో వైరల్ అయ్యింది
జైల్లో చుడిధార్ ( పంజాబీ డ్రస్) వేసుకున్న శశికళ షాపింగ్ చేసే బ్యాగ్ చేతిలో పట్టుకుని దర్జాగా తిరుగుతున్న సీసీ కెమెరాల క్లిప్పింగ్స్ బయటకు రావడంతో ఆ వీడియో వైరల్ అయ్యింది. శశికళ విషయంలో డీఐజీ రూప ఆరోపణలు చేసిన మరుసటి రోజే డీఐజీ రూపను ట్రాఫిక్ విభాగానికి బదిలీ చేశారు.
ఇంటర్వూల్లో శశికళను కడిగేశారు
శశికళ మీద ఆరోపణలు చేసిన తరువాత అనేక జాతీయా మీడియా చానల్స్, దినపత్రికలు రూప ఇంటర్వూలు తీసుకుని వార్తలు ప్రసారం చేస్తూ కథనాలు ప్రచురిస్తోంది. ఈ సందర్బంలో శశికళ, టీటీవీ దినకరన్ కు అత్యంత సన్నిహితుడు, అన్నాడీఎంకే పార్టీ (అమ్మ వర్గం) కర్ణాటక శాఖ ప్రధాన కార్యదర్శి పూహళేంది రూపకు అడ్డుకట్ట వెయ్యాలని కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు లేఖ రాశారు.
డీఐజీ రూప మీద కఠిన చర్యలు
శశికళ విషయంలో అసత్య ప్రచారం చేస్తున్న డీఐజీ రూప మీద కఠిన చర్యలు తీసుకోవాలని పూహళేంది డిమాండ్ చేస్తున్నారు. ప్రతి రోజు ఏదో ఒక మీడియా డీఐజీ రూప ఇంటర్వూ తీసుకోవడం, జైల్లో శశికళకు ఇంత కాలం చేసిన రాచమర్యాదల గురించి వార్తలు ప్రసారం చెయ్యడంతో శశికళ వర్గీయులు హడిలిపోతున్నారు.
ఇదో కొత్త రకం వార్నింగ్
డీఐజీ రూప క్షమాపణలు చెప్పాలని, లేదంటే రూ. 50 కోట్లకు పరువునష్టం దావా వేస్తామని డీజీపీ సత్యనారాయణ రావ్ న్యాయవాది రూపకు లీగల్ నోటీసులు జారీ చేశారు. ఇప్పుడు శశికళ వర్గీయులు కర్ణాటక ప్రభుత్వాన్ని అడ్డంపెట్టుకుని డీఐజీ రూపను ఇలా బెదిరించడానికి స్కెచ్ వేశారు.