కమల్, రజినీ ఎఫెక్ట్: 15న దినకరన్ కొత్త పార్టీ, శశికళతో చర్చ, ఎమ్మెల్యేలు వెళ్లేనా?
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లోకి కొత్త పార్టీలు ప్రవేశిస్తున్నాయి. ఇప్పటికే ప్రముఖ నటుడు కమల్ హాసన్ తన పార్టీని ప్రకటించగా, ఇప్పుడు అన్నాడీఎంకే పార్టీ బహిష్కృత నేత టీటీవీ దినకరన్ తన కొత్త పార్టీని ప్రకటించనున్నట్లు తెలిపారు.
గత కొంత కాలంగా దినకరన్ కొత్త పార్టీ దిశగా అడుగులు వేస్తున్నాడంటూ తమిళ రాజకీయాల్లో చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే.
మదురైలో బహిరంగ సభ
ఈ నేపథ్యంలో మార్చి 15న తేదీన కొత్త పార్టీ పేరు ప్రకటనతోపాటు పార్టీ గుర్తును కూడా ప్రకటించబోతున్నట్లు దినకరన్ స్పష్టం చేశారు. మధురైలో బహిరంగ సభ ఏర్పాటు ద్వారా తన పార్టీ సిద్ధాంతాలను దినకరన్ వెల్లడించనున్నట్లు తెలిపారు.
దినకరన్ అప్రమత్తం
కాగా, కమల్ ఇప్పటికే తన పార్టీతో రాజకీయాల్లోకి రాగా, రజనీ త్వరలోనే తన పార్టీని ప్రకటించనున్నారు. ఇక మరికొందరు ప్రముఖులు కూడా రాజకీయాల్లో క్రియా శీలకంగా వ్యవహరించేందుకు సిద్ధమైతున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే దినకరన్ త్వరపడుతున్నట్లు తెలుస్తోంది.
బహిష్కరించినా గెలుపు
ఇక అక్రమాస్తుల కేసులో శశికళ జైలుకెళ్లిన తర్వాత ముఖ్యమంత్రి పళని సామి.. పన్నీర్సెల్వంతో కలిసి అన్నాడీఎంకే పార్టీపై పట్టుసాధించిన విషయం తెలిసిందే. శశికళ-దినకరన్ వర్గంపై వేటు వేసి, వారిని అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరించారు. అయినప్పటికీ ఆర్కే నగర్ ఉప ఎన్నికలో దినకరన్ స్వతంత్ర్యగా అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.
శశికళతో చర్చ.. ఎమ్మెల్యే వచ్చేనా?
ఓవైపు పార్టీలో సభ్యత్వం.. మరోవైపు రెండాకుల గుర్తును కూడా కోల్పోయిన నేపథ్యంలోనే దినకరన్ కొత్త పార్టీ యోచన ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కొత్త పార్టీ విషయమైన శశికళతో దినకరన్ ఇప్పటికే చర్చలు జరిపినట్లు తెలిసింది. దినకరన్ కొత్త పార్టీ పెడితే శశికళ వర్గం ఎమ్మెల్యేలు ఆయనతో కలిసి వెళ్లేందుకు సుముఖంగానే ఉన్నారా? అనేది తేలాల్సి ఉంది. ఇది పార్టీ ప్రకటన తర్వాతే తెలిసే అవకాశముంది. కాగా, దినకరన్ పార్టీకి కుక్కర్ గుర్తు కేటాయించాలని కోర్టు ఆదేశించింది.