పన్నీర్ సెల్వం, ఎమ్మెల్యేలపై వేటు వెయ్యండి: మద్రాస్ హైకోర్టులో రెబల్ ఎమ్మెల్యే పిటిషన్!
చెన్నై: అన్నాడీఎంకే పార్టీ ఇంటి పోరు ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతోంది. తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, ఆయన వర్గంలోని ఎమ్మెల్యేల మీద స్పీకర్ ధనపాల్, శాసన సభ కార్యదర్శి ఎందుకు చర్యలు తీసుకోలేదు అని ప్రశ్నించాలని టీటీవీ దినకరన్ వర్గం మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
టీటీవీ దినకరన్ ముఖ్య అనుచరుడు, అన్నాడీఎంకే పార్టీ రెబల్ ఎమ్మెల్యేల నాయకుడు తంగ తమిళ్ సెల్వన్ శుక్రవారం మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2017 ఫిబ్రవరి 18వ తేదీ తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించారని పిటిషన్ లో వివరించారు.
ఆ సందర్బంలో తమిళనాడు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన పన్నీర్ సెల్వంతో పాటు ఆయన వర్గంలోని 12 మంది ఎమ్మెల్యేలు ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారని, ఆ సమయంలో వారి మీద స్పీకర్ ధనపాల్, అసెంబ్లీ కార్యదర్శి ఎలాంటి చర్యలు తీసుకోలేదని పిటిషన్ లో గుర్తు చేశారు.
పన్నీర్ సెల్వంతో పాటు ఆయన వర్గంలోని ఎమ్మెల్యేల మీద స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శి ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించాలని రెబల్ ఎమ్మెల్యే తంగ తమిళ్ సెల్వన్ మద్రాసు హైకోర్టులో మనవి చేశారు. ఇప్పటికే పన్నీర్ సెల్వం, ఆయన వర్గంలోని ఎమ్మెల్యేల మీద స్పీకర్ ధనపాల్ చర్యలు తీసుకోలేదని మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చెయ్యడంతో కేసు విచారణ జరుగుతోంది.