సుప్రీం కోర్టులో టీటీవి కి చుక్కెదురు..!పార్టీ సింబల్ కేటాయింపు ఈసి పరిదిలోకి వస్తుందన్న కోర్ట్
న్యూదిల్లీ/హైదరాబాద్ : పార్టీకి గుర్తింపు ఇవ్వాలా..? వద్దా.? అనేది పూర్తిగా ఈసీ పరిధిలోకి వస్తాయని సుప్రీంకోర్ట్ స్పష్టం చేసింది. తమ పార్టీ గుర్తుగా 'ప్రెషర్ కుక్కర్'ను కేటాయించాలంటూ ఏఎంఎంకే అధినేత టీటీవీ దినకరన్ చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెల్ల డించింది. ఒక పార్టీకి గుర్తింపు ఇవ్వాలా..? ఇవ్వకుడదా..? అనేది పూర్తిగా ఎన్నికల సంఘం పరిధిలోకి వస్తుందని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది. గతంలో రెండాకుల గుర్తు కోసం దినకరన్ అలుపెరగని పోరాటం చేసి వెనక్కు తగ్గిన విషయం తెలిసిందే..!
కాగా 'అమ్మా మక్కల్ మున్నేత్ర కళగమ్'(ఏఎంఎంకే) పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపు ఇవ్వని నేపథ్యంలో ఆ పార్టీ తరఫున పోటీచేస్తున్న అభ్యర్థులందరికీ ఒకే గుర్తు కేటాయించే అవకాశం ఉంటే పరిశీలించాలని ఎన్నికల సంఘానికి ధర్మాసనం సూచనప్రాయంగా తెలిపింది. ఇదిలా ఉండగా ఒకే గుర్తు కేటాయించినంత మాత్రాన ఆ అభ్యర్థులందరినీ ఒకే పార్టీకి చెందిన వారిగా గుర్తించలేమని పేర్కొంది. అయితే ప్రస్తుతానికి వారందరినీ కూడా స్వతంత్రులుగానే పరిగణించాలని ఎన్నికల సంఘాన్ని ధర్మాసనం ఆదేశించింది. లోక్సభ, శాసనసభ ఉపఎన్నికల్లో తమిళనాడు సహా పుదు చ్ఛేరిలలో ఈ పార్టీ తరఫున అభ్యర్థులు బరిలో దిగనున్న విషయం విదితమే..!