బూటకపు ఎన్కౌంటర్ కేసు: తులసీరామ్ ప్రజాపతి ఎన్కౌంటర్లో అమిత్ షా హస్తం ఉందన్న విచారణాధికారి
బీజీపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా ఇబ్బందుల్లో చిక్కుకున్నారా...అతన్ని 2006 నాటి బూటకపు ఎన్కౌంటర్ కేసు ఇంకా వెంటాడుతోందా... అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అమిత్షాతో పాటు ఐపీఎస్ అధికారులు దినేష్, రాజ్కుమార్ పాండియన్, డీజీ వంజారాలు 2006లో తులసీరాం ప్రజాపతిని బూటకపు ఎన్కౌంటర్ చేయడంలో కుట్రపన్నారని ఈ కేసును విచారణ చేస్తున్న ప్రధాన విచారణాధికారి ప్రత్యేక కోర్టుకు చెప్పారు.
కేసులో రాజకీయనాయకులకు క్రిమినల్స్కు సంబంధముంది
2006లో జరిగిన బూటకపు ఎన్కౌంటర్ కేసును 2012 నుంచి విచారణ చేస్తున్న విచారణాధికారి సందీప్ తమగడ్గే ప్రత్యేక కోర్టుకు నివేదిక సమర్పించారు. ఈ కేసులో రాజకీయ క్రిమినల్ కోణాలున్నాయని కోర్టుకు తెలిపారు. ఇందులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అమిత్ షా రాజస్థాన్ హోంమంత్రి గులాబ్ చంద్ కటారియాలు రాజకీయనాయకులు కాగా....వీరు సొహ్రబుద్దీన్ షేక్, తులసీరామ్, అజాం ఖాన్ అనే క్రిమినల్స్ ద్వారా 2004లో ప్రముఖ బిల్డర్ల కార్యాలయాలపై కాల్పులు జరపాల్సిందిగా సూచించారని విచారణాధికారి సందీప్ కోర్టుకు తెలిపారు. ఇందులో అమిత్ షా. కటారియా, దినేష్, పాండియన్, వంజారాలు నిర్దోషులని కింది కోర్టు తీర్పు చెప్పింది.
సొహ్రాబుద్దీన్,తులసీ ప్రజాపతిలకు రాజకీయ నాయకుల అండ
విచారణ సందర్భంగా సేకరించి కాల్డేటాలో కూడా కుట్రకోణం కనిపించిందని కోర్టుకు తెలిపారు సందీప్. విచారణ సందర్భంగా కాల్ డేటా రికార్డులు కేసు పరిష్కారంలో చాలా ఉపయోగపడ్డాయని తెలిపారు. ఈ క్రమంలోనే ఎవరెవరి కాల్ డేటా రికార్డులు సేకరించారని డిఫెన్స్ లాయర్ సందీప్ను అడుగగా... అమిత్ షా, దినేష్, వంజారా, పాండియన్, విపుల్ అగర్వాల్, ఆశిష్ పాండ్యా, ఎన్హెచ్ దాభి, జీఎస్ రావుల పేర్లను వెల్లడించారు. ఇందులో పాండ్యా, దాభిలపై ఇంకా కోర్టులో కేసు నడుస్తుండగా మిగతావారికి సంబంధించిన సరైన ఆధారాలు లేకపోవడంతో నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది.
తులసీరాం ప్రజాపతి 2006 డిసెంబర్ 28న గుజరాత్లో చంపివేయబడ్డాడు. అహ్మదాబాదులోని కోర్టులో విచారణకు హాజరై తిరిగి రాజస్థాన్లోని ఉదయ్పూర్కు వెళుతుండగా పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయాడని రాజస్థాన్ పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే సోహ్రబుద్దీన్, తులసీరామ్లు కలిసి పలు దోపిడీలకు పాల్పడే వారిని వీరికి రాజకీయనాయకులు పోలీసుల సహకారం ఉండేదని సీబీఐ పేర్కొంది.అయితే ఈ కేసులో సొహ్రబుద్దీన్, అతని భార్య కౌసర్బీ, తులసీరామ్లను కిడ్నాప్ చేయాలని నవంబర్ 23,2005లో కుట్ర పన్నినట్లు తమ విచారణలో వెల్లడైందని సీబీఐ తెలిపింది. ఈ క్రమంలోనే సొహ్రాబుద్దీన్ను ఎన్కౌంటర్ పేరుతో నవంబర్ 26,2005లో మట్టుబెట్టారని ఆ తర్వాత సొహ్రబుద్దీన్ భార్య కౌసర్బీని హత్య చేయడం జరిగిందని సీబీఐ ఛార్జ్షీట్లో వెల్లడించింది.
నాటి ఉదయ్పూర్ ఎస్పీ దినేష్ కూడా కుట్రపన్నారు
2012లో తను కేసు విచారణకు స్వీకరించినప్పటికే తనకంటే ముందు విచారణ చేసిన అధికారులు సొహ్రాబుద్దీన్ కేసును చాలావరకు పరిష్కరించారని కోర్టుకు తెలిపారు సందీప్. అయితే ఈ కేసుకు సంబంధించి కటారియా మరియు వ్యాపారవేత్త విమల్ పత్నిలను ప్రశ్నించి వారి స్టేట్మెంట్ రికార్డు చేసినట్లు సందీప్ తమగడ్గే కోర్టుకు తెలిపారు. దీనికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయా అని డిఫెన్స్ లాయర్ వాహబ్ ఖాన్ అడుగగా... కోర్టు ఇందుకు అనుమతించలేదు. ఇక తులసీరాం కస్టడీ నుంచి తప్పించుకోవడంపై కూడా వివరణ ఇచ్చారు సందీప్. ఆరోజు రెహ్మాన్ అనే వ్యక్తి తులసీరాంకు ఏర్పాటు చేసిన ఎస్కార్ట్లో లేరని చెప్పారు. అయితే ఆ రోజు మాత్రమే ఆయన ఎస్కార్ట్ టీమ్లో లేరని కానీ కుట్ర మాత్రం చేశారని చెప్పారు. రెహ్మాన్ నాటి ఉదయ్పూర్ ఎస్పీ దినేష్లు కుట్ర చేశారని చెప్పారు. ఇదిలా ఉంటే కింది కోర్టు దినేష్ను నిర్దోషిగా గతేడాది పేర్కొంది. బాంబే హైకోర్టు కూడా కింది కోర్టు తీర్పును సమర్థించింది. .