పోలీస్ కస్టడీలో లైంగిక దాడి ? తండ్రీకొడుకుల దుర్మరణం... తమిళనాడులో రాజకీయ దుమారం
పోలీసులు క్రూరత్వం కారణంగా జార్జి ఫ్లాయిడ్ మరణంపై అమెరికాలో చెలరేగిన ఆగ్రహజ్వాలలు తెలిసిందే. తమిళనాడులోనూ అట్లాంటి ఘటన చోటు చేసుకుంది. తమిళనాడులోని టుటికోరిన్ జిల్లాలో పోలీస్ కస్టడీలో ఇద్దరు తండ్రి కొడుకులు దుర్మరణం పాలైన ఘటన ప్రస్తుతం రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపింది. ఇక కస్టడీలో ఉన్న వీరిద్దరిపై దారుణమైన లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న ప్రతిపక్షాలు అధికార పార్టీని టార్గెట్ చేస్తున్నాయి.
Recommended Video
పోలీస్ కస్టడీలో తండ్రీ కొడుకులపై దారుణం జరిగిందా ?
జూన్ 19వ తేదీన లాక్ డౌన్ సమయంలో 59 ఏళ్ల వయసున్న జయరాజ్, 31 ఏళ్ల వయసున్న అతని కుమారుడు జే ఫెనిక్స్ తమ మొబైల్ స్టోర్ ను తెరిచారు. లాక్డౌన్ సమయంలో షాప్ తెరిచేందుకు సాతంకుళం పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. ఇక కస్టడీలో వారిని దారుణంగా కొట్టడంతో వారు చనిపోయారు అని సమాచారం.
అయితే పోలీస్ కస్టడీలో జయరాజ్ ను,అలాగే తన కుమారుడు ఫినిక్స్ పై లైంగిక దాడి జరిగిందని, అసహజ రీతిలో పోలీసులు వారి మర్మాంగాలపై దాడి చేశారని వారి స్నేహితులు ఆరోపిస్తున్నారు.
రాత్రంతా పోలీసులు లైంగిక హింసకు గురి చేశారని ఆరోపణలు
చిరిగిన బట్టలతో, రక్తంతో తడిసిన బట్టలతో వారు జైలు నుంచి బయటకు వచ్చారని పేర్కొన్నారు. ఇక జైలు నుంచి బయటకు వచ్చిన వారిని, ఆసుపత్రికి తరలించి వైద్యులతో బలవంతంగా ఫిట్ గా ఉన్నారని రిపోర్ట్ రాయించారని కూడా వారి బంధువులు ఆరోపిస్తున్నారు. ఆ తరువాత ఫెనిక్స్ ను, అతని తండ్రి జయరాజ్ ను జుడిషియల్ మెజిస్ట్రేట్ వద్దకు తీసుకు వెళ్లినా పోలీసుల బెదిరింపు కారణంగా వారు నిజం చెప్పలేకపోయారని ఆరోపిస్తున్నారు. పోలీస్ స్టేషన్లో వారు ఉన్న సమయంలో రాత్రంతా వీరిపై రాక్షస క్రీడ జరిగిందని, అరుపులు కేకలు అక్కడి వారందరికీ వినిపించాయని వారు ఆరోపిస్తున్నారు.
పోలీసుల కస్టడీలో తండ్రీకొడుకుల మరణంపై ఆగ్రహావేశాలు
ఇక పోలీసుల కస్టడీలో జరిగిన దాడికి తండ్రీకొడుకులు మరణించడం టుటికోరిన్ లో ఆగ్రహావేశాలకు కారణమయ్యాయి. రాజకీయ దుమారాన్ని రేపాయి. సాతంకుళంపోలీస్ స్టేషన్ లో వ్యాపారస్తులైన ఇద్దరు తండ్రీకొడుకుల కస్టోడియల్ మరణాన్ని నిరసిస్తూ జిల్లాలో దుకాణాలు బంద్ పాటించాయి. ఈ ఘటనపై మద్రాస్ హైకోర్టు సీరియస్ అయింది. సుమోతోగా కేసు తీసుకుని నివేదిక కోరింది. వీరిద్దరి మృతిపై జూన్ 26న నివేదిక సమర్పించాలని హైకోర్టు మధురై బెంచ్ పోలీసులను ఆదేశించింది.
జ్యుడీషియల్ దర్యాప్తుకు ఆదేశం .. ఘటనపై స్పందించిన సీఎం
వీరిద్దరని అరెస్ట్ చేసి కోవిల్ పట్టి ఉప జైల్లో ఉంచినట్లు టుటికోరిన్ కలెక్టర్ సందీప్ నండూరి పేర్కొన్నారు. అంతే కాదు పోలీసుల కస్టడీలో వారు మృతి చెందారని ఫిర్యాదులు వచ్చాయని, దీనిపై జ్యుడిషియల్ దర్యాప్తుకు ఆదేశించామని ఆయన పేర్కొన్నారు. తమిళనాడు సీఎం కే పళనిస్వామి మృతుని కుటుంబానికి 10 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామని కూడా సీఎం ప్రకటించారు. ఈ ఘటనకు బాధ్యులైన ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేస్తున్నట్లు గా తెలిపారు. అంతే కాదు మద్రాస్ హైకోర్టు ఆదేశాల మేరకు చట్టపరమైన చర్యలుతీసుకుంటామని కూడా చెప్పారు.
పోలీసులపై హత్యాయత్నం కేసులు నమోదుకు డిమాండ్
ఇక మృతుల కుటుంబం వీరి మరణానికి కారణమైన పోలీసులపై హత్యకేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది. వారు తమ కుటుంబంలో ఉన్న పెద్ద దిక్కును కోల్పోయామని, ఈ ఘటనకు బాధ్యులైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తమిళనాడు పోలీసుల కస్టడీలో ఉన్న తండ్రీకొడుకులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై డీఎంకే ఎంపీ కనిమొళి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ ను ఆమె కోరారు. వారిని దర్యాప్తు పేరుతో తీవ్రంగా హింసించిన ఆరోపణలు వస్తున్నాయని కనిమొళి ఎన్ హెచ్ ఆర్ సి కి రాసిన లేఖలో పేర్కొన్నారు .
జాతీయ మానవ హక్కుల సంఘానికి కనిమొళి లేఖ
అంతేకాదు ఫెనిక్స్ మర్మాంగంలోకి పోలీసులు లాఠీని చొప్పించడంతో తీవ్రంగా రక్తస్రావం జరిగిందని, జయరాజ్ ను కూడా పోలీసులు తీవ్రంగా కొట్టి ఆయన ఛాతీపై ఇష్టానుసారంగా బూటు కాళ్లతో తొక్కి తీవ్రంగా హింసించారని కనిమొళి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సంఘటనలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని ఈ ఘటనకు కారకులైన పోలీస్ అధికారులపై దర్యాప్తు జరిపి కఠినంగా శిక్షించాలని ఆమె కోరారు.
తమిళనాడు సర్కార్ కు తలనొప్పిగా టుటికోరిన్ ఘటన
డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ కూడా తమిళనాడు ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడానికి ముఖ్యమంత్రి నేతృత్వంలోని ప్రభుత్వం అనుమతి ఇస్తుందని ఆయన మండిపడ్డారు. కరోనా లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో పోలీసులు తండ్రి , కొడుకులను అరెస్ట్ చేసి తీవ్రంగా హింసించి వారి మరణానికి కారణమయ్యారని ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. దీంతో ప్రస్తుతం తమిళనాట ఈ ఘటనతో పెద్ద రాజకీయ దుమారం రేగింది. ప్రజలు సైతం ఆగ్రహావేశాలతో ఊగిపోతున్నారు.