షాకింగ్ : నటుడి ఆత్మహత్య.. అద్దె కూడా చెల్లించలేని స్థితిలో.. లాక్ డౌన్ ఎఫెక్ట్..
కరోనా వైరస్ కారణంగా అనేక రంగాలు కుదేలయ్యాయి. కాస్తో.. కూస్తో.. సంపాదించుకుని గౌరవంగా బతుకుతున్న చాలామంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడుతున్న పరిస్థితి. సినిమా ఇండస్ట్రీలోని అప్కమింగ్ నటీనటులు,యాంకర్స్,టెక్నీషియన్స్ లాక్ డౌన్ కారణంగా పని లేక ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా టీవీ నటుడు మన్మీత్ గ్రెవాల్(32) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లాక్ డౌన్ కారణంగా ఉపాధి లేకుండా పోవడం,అప్పులు పెరిగిపోవడంతో మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఉరేసుకుని ఆత్మహత్య..
నేవీ ముంబైలోని తన నివాసంలో శుక్రవారం రాత్రి బెడ్రూమ్లో మన్మీత్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ సమయంలో అతని భార్య డిన్నర్ ప్రిపేర్ చేస్తోంది. బెడ్రూమ్లో పెద్ద శబ్దం రావడంతో వెంటనే కిచెన్ నుంచి బెడ్ రూమ్ వైపు పరిగెత్తింది. అప్పటికే మన్మీత్ ఉరికి వేలాడుతూ కనిపించడంతో పెద్దగా ఏడుస్తూ సహాయం కోసం అరిచింది. అయితే ఆమె ఆవేదన అరణ్య రోదనే అయింది. మన్మీత్కి కరోనా సోకిందేమోనన్న అనుమానంతో ఇరుగుపొరుగు ఎవరూ సాయం చేసేందుకు ముందుకు రాలేదు.అనంతరం సెక్యూరిటీ సాయంతో బాడీని కిందకు దించి అతన్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్దారించారు.
ఆరోజు ఏం జరిగింది..
'ఆరోజు సాయంత్రం ఎప్పటిలాగే కనిపించాడు. తన గదిలోకి వెళ్లి తలుపేసుకున్నాడు. ఆ సమయంలో అతని భార్య కిచెన్లో వంట చేస్తోంది. ఒక్కసారిగా కుర్చీ కిందపడ్డట్టు పెద్ద శబ్దం రావడంతో పరిగెత్తుకెళ్లింది. బెడ్రూమ్లోకి వెళ్లి.. వేలాడుతున్న అతన్ని పట్టుకుని సాయం కోసం పెద్దగా అరిచింది. ఆమె అరుపులకు ఇరుగుపొరుగు అక్కడికి వచ్చారు కానీ.. బాడీని కిందకు దించేందుకు ఎవరూ సాయం చేయలేదు.' అని మన్మీత్ స్నేహితుడు మంజిత్ సింగ్ తెలిపారు.
ఆర్థిక కష్టాలు..
చివరకు సెక్యూరిటీ గార్డ్ సహాయంతో మన్మీత్ మెడకు ఉన్న చున్నీని కత్తిరించి బాడీని కిందకు దించినట్టు మంజిత్ చెప్పారు. హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు చెప్పారన్నారు. మన్మీత్ కొంతకాలంగా తీవ్ర ఆర్థిక సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నాడని.. భార్య బంగారు నగలు కూడా తాకట్టు పెట్టాడని తెలిపారు. ఆఖరికి నెలవారీ అద్దె రూ.8500 చెల్లించేందుకు కూడా తన వద్ద డబ్బు లేకపోయిందన్నారు.
Recommended Video
టీవీ సీరియల్స్,వెబ్ సిరీస్లో నటించిన మన్మీత్..
శనివారం మన్మీత్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. అతని మరణం చాలామందిని కలచివేసింది. పంజాబ్కు చెందిన మన్మీత్ 'ఆదత్ సే మజ్బూర్', 'కుల్దీపాక్' వంటి సీరియల్స్లో నటించాడు. ఓ వెబ్ సిరీస్తో పాటు,పలు కమర్షియల్స్ లోనూ నటిస్తున్నాడు. అయితే లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్కి బ్రేక్ పడటంతో ఆదాయం లేకుండా పోయింది. చివరకు ఆత్మహత్య చేసుకుని తనువు చాలించాడు. మన్మీత్కు రెండేళ్ల క్రితం వివాహమైనట్టు సమాచారం. అప్పటినుంచి అతను ముంబైలోని ఖర్గార్లో భార్యతో కలిసి నివసిస్తున్నాడు.