టీవీ నటి పొలిటికల్ ఎంట్రీ..లోక్ సభ స్థానంపై కన్ను: ఉమ్మడి ఏపీ మాజీ గవర్నర్ కు బంధువు
ముంబై: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాస్త ప్రేక్షకుల ఆదరణ ఉన్న నటీనటులు రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారు. తెలుగు తెరపై హీరోయిన్లుగా ఓ వెలుగు వెలిగిన దివ్యవాణి, వాణి విశ్వనాథ్ తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. పసుపు కండువా కప్పుకొన్నారు. తాజాగా- ఓ టీవీ నటి కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆమె పేరు శిల్పా షిండే. క్రమం తప్పకుండా కొన్ని హిందీ సీరియళ్లను చూసే వీక్షకులకు ఆమె సుపరిచితురాలు.
మహారాష్ట్రకు చెందిన శిల్పా షిండే.. మంగళవారం ముంబైలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సంజయ్ నిరుపమ్ ఆమెకు కండువా కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తాను పోటీ చేయాలని నిర్ణయించినట్లు శిల్పా షిండే తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉద్దేశంతోనే తాను రాజకీయాల్లోకి ప్రవేశించినట్లు స్పష్టం చేశారు.
క్షేత్ర స్థాయిలో మార్పు తీసుకుని రావాలంటే.. అది రాజకీయాల వల్లే సాధ్యపడుతుందని ఆమె చెప్పుకొచ్చారు. తన రాజకీయ రంగ ప్రవేశానికి కాంగ్రెస్ పార్టీనే ఎంచుకోవడానికీ ఓ కారణం చెప్పారు. శిల్పా షిండే తండ్రి కాంగ్రెస్ నాయకుడేనట. అదీ కాకుండా- కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా పనిచేసిన సుశీల్ కుమార్ షిండే దగ్గరి బంధువు అవుతారట. అందుకే- తాను కాంగ్రెస్ లోనే చేరాలని నిర్ణయించుకున్నట్లు శిల్పా తెలిపారు. సుశీల్ కుమార్ షిండేని స్ఫూర్తిగా తీసుకుని తాను రాజకీయాల్లో రాణిస్తానని అన్నారు.
భాభీ జీ ఘర్ పర్ హై అనే టీవీ సీరియల్ ద్వారా శిల్పా షిండే గుర్తింపు పొందారు. ఆ సీరియల్ ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అంగూరీ భాభీ క్యారెక్టర్ ను పోషించారు. బిగ్ బాస్ సీజన్ - 11 విన్నర్ కూడా. దాని తరువాత ఆమె సునీల్ గ్రోవర్ తో కలిసి జియో ధనాధన్ అనే వెబ్ సిరీస్ లో నటించారు. క్రికెట్ బ్యాక్ గ్రౌండ్ గా సాగే ఈ వెబ్ సిరీస్ తో ప్రేక్షకులకు చేరువ అయ్యారు.
శిల్పా షిండేకు లోక్ సభ టికెట్ ఇస్తామని సంజయ్ నిరుపమ్ తెలిపారు. అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. శిల్పాకు ప్రజల్లో మంచి ఆదరణ ఉందని, దీని ఆధారంగానే ఆమెకు పార్టీలో చేర్చుకున్నట్లు చెప్పారు. ఈ సారి లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బాలీవుడ్ నుంచి కూడా కొందరు తమ పార్టీలో చేరడానికి ఆసక్తిగా ఉన్నారని, త్వరలోనే వారి వివరాలను వెల్లడిస్తామని అన్నారు.