విషాదం: ప్రముఖ టీవీ నటి సెజల్ శర్మ ఆత్మహత్య
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ టీవీ నటి సెజల్ శర్మ ఆత్మహత్యకు పాల్పడ్డారు. 'దిల్ తో హ్యాపీ హై జీ'లో సిమ్మీ ఖోస్లాగా గుర్తింపు పొందిన శర్మ.. శుక్రవారం తన గదిలో ఆత్మహత్య చేసుకున్నారు.
తన జీవితంలో గతంలో చోటు చేసుకున్న ఘటనలతో తీవ్ర మనోవేదనకు గురవుతున్న సెజల్ శర్మ.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజస్థాన్లోని ఉదయ్పూర్కు చెందిన సెజల్ శర్మ.. నటీ కావాలని బలమైన కోరికతో 2017లో ముంబైకి వచ్చారు. స్టార్ ప్లస్ ఛానల్లో ప్రసారమయ్యే 'దిల్ తో హ్యాపీ హై జీ'అనే టీవీ షోలో ఆమె తొలిసారి నటించారు.
ఆ తర్వాత పలు కమర్షియల్స్లోనూ సెజల్ శర్మ నటించారు. 'ఆజాద్ పెరిండే' అనే ఓ వెబ్ సిరీస్లో కూడా ఆమె నటించి మెప్పించారు. సెజల్ శర్మ ఆత్మహత్య ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సెజల్ శర్మ సహ నటుడు అరు కే వర్మ మాట్లాడుతూ.. సెజల్ ఆత్మహత్య వార్త విని తాను దిగ్భ్రాంతికి గురయ్యానని తెలిపారు. పది రోజుల క్రితమే తాను ఆమెను కలిశానని, గత ఆదివారం వాట్సాప్ చాట్ చేసినట్లు చెప్పారు.
పది రోజుల క్రితం ఆమెను కలిసినప్పుడు ఆమె అప్పుడు బాగానే ఉందని తెలిపారు. ఇంతలోనే ఈ వార్త వినడం బాధాకరమని అన్నారు. ఓ టీవీ షోలో సెజల్ శర్మ సోదరుడిగా ఆయన వర్మ నటించారు. సెజల్ శర్మ మృతదేహాన్ని ఆమె కుటుంబసభ్యులు ఉదయ్ పూర్ తీసుకెళ్తున్నారని, అక్కడే అంత్యక్రియలు నిర్వహిస్తారని చెప్పారు.