'చిన్నారి పెళ్లికూతురు' ఫేం ప్రత్యూషకు వేధింపులు!
ముంబై: బుల్లి తెర ప్రముఖ నటి, చిన్నారి పెళ్లికూతురు (బాలికా వధు) ఫేం ప్రత్యూష బెనర్జీ ఇటీవల తన సొంతింట్లోనే తీవ్ర భయాందోళనలకు గురైంది. ముంబైలోని కండివాలిలోని తన ఇంటిలోకి ప్రవేశించిన కొందరు దుండగులు ఆమెపై వేధింపులకు పాల్పడ్డారని తెలుస్తోంది.
ఈ మేరకు ఆమె కండివాలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై వేధింపులకు పాల్పడ్డ వ్యక్తులు తమను తాము పోలీసులుగా చెప్పుకున్నారని, వాస్తవానికి వారు పోలీసులు కాదని కూడా ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడించేందుకు ఆమె అంగీకరించలేదు.
పోలీసు డ్రెస్సుల్లో ఉన్న నలుగురు తనను వేధించారని ఆమె ఆరోపించింది. నలుగురు ఇంట్లోతి దౌర్జన్యంగా ప్రవేశించి తన పట్ల దురుసుగా ప్రవర్తించారని పేర్కొంది.
ఇదిలా ఉండగా, ప్రత్యూష ఆరోపణలను పోలీసు అధికారి ఖండించారు. ఇంట్లో ఉంటున్న రాహుల్ సింగ్ అనే వ్యక్తి కోసం పోలీసులు వెళ్లారని, అతని పైన అభియోగాలు ఉన్నాయన్నారు. డిసెంబర్ 31వ తేదీన రాహుల్, అమిత్ దాల్వి అనే లోన్ రికవరీ ఏజెంటు పైన చేయి చేసుకున్నారని చెప్పారు.
ఆదివారం నాడు పోలీసులు దాల్వితో కలిసి రాహుల్ కోసం ప్రత్యూష ఇంటికి వెళ్లారని, ఆ సమయంలో అతను ఇంట్లో లేడని చెప్పారు. పోలీసులు మరోసారి ప్రత్యూష ఇంటికి వెళ్లగా.. రాహుల్ గోవాలో ఉన్నట్లు ఆమె తల్లి చెప్పారన్నారు. అంతేకాని, నటి ప్రత్యూషతో పోలీసులు అమానుషంగా ప్రవర్తించలేదన్నారు.