లాక్డౌన్ సమయంలో టీవీ చూడటం 8శాతం పెరిగిందట: బార్క్ ఇండియా రిపోర్ట్
న్యూఢిల్లీ: కరోనావైరస్ విజృంభిస్తుండటంతో ప్రపంచమంతా లాక్డౌన్లోకి వెళ్లిపోయింది. ఇందుకు భారత్ మినహాయింపు కాదు. ఏప్రిల్ 14 వరకు భారత్ లాక్డౌన్లో ఉంటుంది. ఏప్రిల్ 14వరకు భారత్ లాక్డౌన్లో ఉంటున్న నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఉద్యోగస్తులు చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుండగా మరికొందరు మాత్రమే ఆఫీసులకు అది కూడా అత్యవసర పరిస్థితుల్లోనే వెళుతున్నారు. ఇక చాలామంది ఇళ్లకే పరిమితం కావడంతో టైంపాస్ కోసం టీవీలు పెట్టుకుని చూస్తున్నారు. దీంతో టీవీ వినియోగం భారత్లోపెరిగిందని బార్క్ నీల్సన్ సర్వే వెల్లడిస్తోంది.
8శాతం మేరా పెరిగిన టీవీ వినియోగం
తొలి వారంలో 8శాతం ఎక్కువగా టీవీ వినియోగం ఉన్నిందని బార్క్ ఇండియా మరియు నీల్సన్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. కోవిడ్-19తో చాలామంది ఇళ్లకే పరిమితం కావడంతో స్మార్ట్ ఫోన్లను కూడా విరివిగా ఈ సమయంలో వినియోగించినట్లు నివేదిక చెబుతోంది. స్మార్ట్ ఫోన్ వినియోగం సాధారణం కంటే 6శాతం వినియోగం ఎక్కువగా నమోదైంది. కోవిడ్-19 విజృంభిస్తున్న సమయంలో స్మార్ట్ ఫోన్ వినియోగ సమయం 1.5 గంటలు ఎక్కువగా ఉందని నివేదిక వెల్లడించింది. ఈ నివేదికను బార్క్ ఇండియా సీఈఓ సునీల్ లుల్లా, నీల్సన్ గ్లోబల్ మీడియా సౌత్ ఏషియా హెడ్ డాలీ ఝాలు విడుదల చేశారు.
టాప్ ప్లేస్లో నిలిచిన మోడీ ప్రసంగం
13 జనవరి నుంచి 2 ఫిబ్రవరి 2020 మరియు 16 మార్చి నుంచి 22 మార్చి వరకు ఈ నివేదికను తీశారు. ఇక దేశం మొత్తం సంపూర్ణంగా లాక్డౌన్లోకి వెళుతుందని ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి టీవీ ద్వారా చేసిన ప్రసంగం అతిపెద్ద ఈవెంట్గా అభివర్ణించింది రిపోర్టు. ఇది ఐపీఎల్ ఫైనల్స్ను వీక్షించిన వారి సంఖ్య కంటే కూడా ఎక్కువగా ఉన్నిందని లుల్లా చెప్పారు. ఐపీఎల్ ఫైనల్స్ను టీవీల్లో 133 మిలియన్ మంది వీక్షించగా ప్రధాని మోడీ ప్రసంగాన్ని 197 మిలియన్ మంది వీక్షించినట్లు చెప్పారు. ఇక ఈ వృద్ధి అంతా నాన్ ప్రైమ్ వ్యూయర్షిప్ నుంచి వచ్చినదే అని డేటా ద్వారా తెలుస్తోంది.
స్మార్ట్ ఫోన్ ద్వారా వార్తలు వీక్షించిన గ్రామీణ ప్రజలు
టీవీ వినియోగం ఓవరాల్గా 8శాతం మేరా పెరుగగా... వార్తలను స్మార్ట్ఫోన్లపై వీక్షించిన వారు మెట్రో నగరాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల వారు కూడా వీక్షించారని నివేదిక వెల్లడించింది. వీడియో ఆన్ డిమాండ్కు వివిధ వయస్సు వారు ఎక్కువగా వీక్షించారని నివేదిక వెల్లడించింది. ఇక షాపింగ్, ట్రావెల్, ఫుడ్ యాప్స్ను కూడా చాలా ఎక్కువగానే చూసినట్లు బార్క్ ఇండియా నీల్సన్ రిపోర్ట్ సంస్థలు వెల్లడించాయి.