‘పోప్’లేం కాదు: ఎలక్ట్రానిక్ మీడియాపై సుప్రీం ఆగ్రహం, వార్నింగ్
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ మీడియాపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అవాస్తవాలు, నిరాధారమైన పరోక్ష నిందలను ప్రచురించరాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. టీవీ మీడియా, వెబ్సైట్లు తమను తాము చర్చి బోధకుడి వేదికపైనున్న పోప్గా భావించకూడదని స్పష్టం చేసింది.
బాధ్యతాయుతమైన పాత్రికేయానికి ఉన్న ప్రాధాన్యాన్ని నొక్కివక్కాణించింది. ఎలక్ట్రానిక్ మీడియా, వెబ్సైట్లు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం ఉందని తెలిపింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఈ హెచ్చరిక చేసింది.
మీడియా గొంతు నొక్కే ప్రసక్తే ఎన్నటికీ రాదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా అన్నారు. మీడియా గొంతు నొక్కే ప్రయత్నాలన్నిటినీ తాను స్వయంగా తిరస్కరించినట్లు తెలిపారు. మీడియా, మరీ ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
తమకు వెబ్సైట్లు ఉన్నాయని దేనిని పడితే దానిని ప్రచురించరాదని తేల్చి చెప్పారు. దేనినైనా రాసేసి, దానిని వెబ్సైట్లో ప్రచురించారన్న కారణంతో తప్పించుకోవడం పాత్రికేయ సంస్కృతి కాదని స్పష్టం చేశారు. మనసుకి ఏది తోస్తే దానిని రాసేయకూడదని వివరించారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని మరోసారి స్పష్టం చేశారు.