గంటల వ్యవధిలో.. ఢిల్లీలో రెండు భారీ అగ్ని ప్రమాదాలు.. దగ్ధమైన 1500 ఇళ్లు..
దేశ రాజధాని ఢిల్లీలో రెండు భారీ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. సోమవారం అర్దరాత్రి ఆగ్నేయ ఢిల్లీలో ఒక ప్రమాదం చోటు చేసుకోగా.. మంగళవారం ఉదయం నార్త్వెస్ట్ ఢిల్లీలో మరో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రెండు ప్రమాదాల్లోనూ ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గంటల వ్యవధిలోనే రెండు అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడం స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది.
ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు.. 30 ఫైరింజన్ల మోహరింపు..
తుగ్లకాబాద్ మురికివాడలో అర్థరాత్రి అగ్ని ప్రమాదం..
సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆగ్రేయ ఢిల్లీలోని తుగ్లకాబాద్లో ఉన్న మురికివాడలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు దావానంలా వ్యాపించాయి. దీంతో సుమారు 1500 ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న ఫైరింజన్ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. 28 ఫైరింజన్లతో మంటలను ఆర్పే ప్రయత్నంగా చేయగా తెల్లవారుజామున 3.40గంటలకు అదుపులోకి వచ్చాయి.చీఫ్ ఫైర్ ఆఫీసర్ అతుల్ గార్గ్ మాట్లాడుతూ.. 'తుగ్లకాబాద్ స్లమ్లో మంటలు ఎగసిపడుతున్నట్టు 12.15గం. మాకు సమాచారం అందించింది. వెంటనే 28 ఫైరింజన్లను సంఘటనా స్థలికి తరలించాం. తెల్లవారుజామున 4గం. వరకు మంటలు అదుపులోకి వచ్చాయి.' అయితే ప్రమాదం జరిగిన చోటు కొండపై ఉండటంతో ఫైరింజన్స్ వెళ్లడానికి కాస్త సమయం పట్టిందన్నారు. అయినప్పటికీ 4గంటల్లోనే మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్టు చెప్పారు.
ప్రాణ నష్టం సంభవించలేదు..
అదృష్టవశాత్తు అగ్ని ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని,ప్రాణ నష్టం సంభవించలేదని అతుల్ గార్గ్ తెలిపారు. ప్రమాదానికి కారణమేంటన్నది ఇంకా తెలియరాలేదని.. దాని గురించే స్థానికులను ఆరా తీస్తున్నామని స్పష్టం చేశారు. డీసీపీ రాజేంద్ర ప్రసాద్ మీనా మాట్లాడుతూ.. 'అగ్ని ప్రమాదానికి సంబంధించి అర్థరాత్రి ఒంటిగంటకు సమాచారం అందింది. అందుబాటులో ఉన్న పోలీస్ సిబ్బంది అందరినీ అక్కడ మోహరించాం. ఇప్పటివరకూ ఉన్న సమాచారం ప్రకారం 1000-1200 ఇళ్లు మంటలకు దగ్ధమయ్యాయి.' అని తెలిపారు.అగ్ని ప్రమాదం సంభవించగానే స్థానికులు ప్రాణ భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగు తీసినట్టు డీసీపీ తెలిపారు.
కేశవపురంలో మరో అగ్ని ప్రమాదం..
మంగళవారం ఉదయం 8.34గం. ప్రాంతంలో కేశవపురంలో మరో అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ఫుట్వేర్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీలో మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడ్డాయి. దీంతో హుటాహుటిన 23 ఫైరింజన్లు అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.