ట్వీస్ట్: బెంగళూరు పోలీస్ స్టేషన్ లో రూ. 1. 94 కోట్లు మాయం, దొంగ పోలీసులు, ఏసీపీ !
బెంగళూరు: బెంగళూరు సీసీబీ పోలీస్ స్టేషన్ లో రూ. 1. 94 కోట్ల విలువైన పాత నోట్లు (రూ. 1,000, రూ. 500) మాయం అయిన కేసులో కొత్త ట్వీస్ట్. పోలీసు అధికారులే పోలీస్ స్టేషన్ లో రూ. 1. 94 కోట్లు మాయం చేసి ఉంటారని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
బెంగళూరు సీసీబీ డీసీపీ జితేంద్ర నేతృత్వంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. బెంగళూరు సీసీబీ ఏసీపీ ఆధ్వర్యంలో నవంబర్ 26వ తేదీన హైగ్రౌండ్స్ సమీపంలోని ఓ మహిళ ఇంటిలో దాడులు చేసిన సీసీబీ పోలీసులు రూ. 3 కోట్ల విలువైన రద్దు అయిన పాత నోట్లు స్వాధీనం చేసుకున్నారు.
ఆ సందర్బంలో రూ. 1 కోటి 6 లక్ష్లలకు మాత్రమే లెక్కలు చూపించిన పోలీసులు మిగిలిన సోమ్మును బెంగళూరులోని చామరాజపేటలోని సీసీబీ పోలీస్ స్టేషన్ నుంచి మాయం చేశారు. అనంతరం ఏమీ తెలియనట్లు పోలీసులు డ్రామాలు ఆడారు.
బాధితురాలు ఫిర్యాదు చెయ్యడంతో పోలీస్ స్టేషన్ నుంచి నగదు మాయం అయిన విషయం వెలుగు చూసింది. విషయం తెలుసుకున్న సదరు ఏసీపీ, సబ్ ఇన్స్ పెక్టర్ హూంబేగౌడ, కానిస్టేబుల్స్ నరసింహమూర్తి, గంగాధర్ మాయం అయ్యారు. ఈ కేసులో మహిళకు, పోలీసులకు మధ్యవర్తిగా వ్యవహరించిన రమేష్ రాజ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. రూ. 1. 94 కోట్లు మాయం చేసిన దొంగ పోలీసుల కోసం ఇప్పుడు పోలీసులు గాలిస్తున్నారు.