ట్విస్ట్: తండ్రికి అవమానం, బెంగళూరులో ఆంధ్రా విద్యార్థి ఆత్మహత్య, రూ. 14 లక్షల జీతం !
బెంగళూరు: బెంగళూరు నగరంలోని వర్తూరు సమీపంలోని కనవనహళ్ళిలోని ప్రసిద్ది చెందిన అమృత విశ్వవిద్యాపీఠ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ లో నాలుగవ సంవత్సరం చదువుతున్న విశాఖపట్నం (వైజాగ్)కు చెందిన శ్రీహర్ష (20) ఆత్మహత్య కేసు ఊహించని మలుపు తిరిగింది. తండ్రిని గేట్ బయట నిలబెట్టి కాలేజ్ యాజమాన్యం అవమానించడం వలనే శ్రీహర్ష ఆత్మహత్య చేసుకున్నాడని విచారణలో వెలుగు చూసింది. అయితే శ్రీహర్ష తండ్రిని తాము అవమానించలేదని కాలేజ్ యాజమాన్యం అంటోంది. రూ. 14 లక్షల జీతం వచ్చే ఉద్యోగం అపాయింట్ లెటర్ ను కాలేజ్ యాజమాన్యం చించేసిందని శ్రీహర్ష తండ్రి ఆరోపించారు.
ఏం జరిగిందంటే !
అమృత విశ్వవిద్యాపీఠ ఇంజనీరింగ్ కాలేజ్ లో చదువుతున్న శ్రీహర్ష అదే కాలేజ్ హాస్టల్ ఉంటున్నాడు. హాస్టల్ కు నీరు సక్రమంగా సరఫరా చెయ్యడం లేదని, భోజనం సరిగా పెట్టడం లేదని ఆరోపిస్తూ సెప్టెంబర్ 23వ తేదీన కాలేజ్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఆ సందర్బంగా ధర్నా చేస్తున్న విద్యార్థులు ఆవేశంలో బస్సుల మీద, కాలేజ్ మీద రాళ్ల వర్షం కురిపించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ గొడవలకు సంబంధించి కాలేజ్ క్రమశిక్షణా కమిటి శ్రీహర్షతో సహ 19 మందిని కాలేజ్ నుంచి సస్పెండ్ చేశారు.
తండ్రిని గేట్ బయట నిలబెట్టారు !
శ్రీహర్షను పిలిచిన యాజమాన్యం మీ తండ్రిని పిలుచుకుని రావాలని చెప్పింది. గత సోమవారం శ్రీహర్ష తండ్రి విజయ్ కుమార్ అలియాస్ భాస్కర్ వైజాగ్ నుంచి బెంగళూరు వచ్చారు. సోమవారం కాలేజ్ బయట శ్రీహర్ష తండ్రిని నిలిపివేశారు. కాలేజ్ లోపలికి శ్రీహర్షను మాత్రమే అనుమతించారు. తరువాత కాలేజ్ నుంచి నిన్ను సస్పెండ్ చేశామని, ఇక్కడి నుంచి వెళ్లి పోవాలని కాలేజ్ యాజమాన్యం శ్రీహర్షకు చెప్పిందని అతని స్నేహితులు ఆరోపించారు.
తండ్రిని అవమానించారని ఆత్మహత్య !
కాలేజ్ లోపలికి వెళ్లడానికి తనను మాత్రమే అనుమతించారని, వైజాగ్ నుంచి పిలిపించి తన తండ్రిని కాలేజ్ గేట్ బయటే నిలబెట్టి అవమానించారని ఆరోపిస్తూ శ్రీహర్ష కాలేజ్ 7వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి స్నేహితులు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడికి పిలిపించి ఎందుకు శ్రీహర్ష తండ్రిని కాలేజ్ గేట్ బయట నిలబెట్టారని శ్రీహర్ష స్నేహితులు ప్రశ్నిస్తున్నారు.
రూ. 14 లక్షల ఉద్యోగం
కాలేజ్ క్యాంపస్ సెలెక్షన్ లో శ్రీహర్షకు సంవత్సరానికి రూ. 14 లక్షల ప్యాకేజ్ వచ్చే మంచి ఉద్యోగం వచ్చింది. మంచి ఉద్యోగం వచ్చిందని శ్రీహర్ష సైతం సంతోషంగా ఉన్నాడు. ఉద్యోగం ఇచ్చిన కంపెనీ ఇచ్చిన అపాయింట్ మెంట్ లెటర్ ను కాలేజ్ యాజమాన్యం చించివేసిందని, ఈ విషయంలో శ్రీహర్ష కుంగిపోయాడని అతని కాలేజ్ స్నేహితులు ఆరోపించారు.
శ్రీహర్ష తండ్రి ఆరోపణలు
తన కుమారుడికి మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చిందని, కంపెనీ ఇచ్చిన అపాయింట్ మెంట్ లెటర్ ను కాలేజ్ యాజమాన్యం చించివేసిందని శ్రీహర్ష తండ్రి విజయ్ కుమార్ ఆరోపించారు. ఆ రోజు కాలేజ్ విద్యార్థులు చేసిన ధర్నాలో శ్రీహర్ష పాల్గొనలేదని, అయినా తన కుమారుడిని కాలేజ్ యాజమాన్యం సస్పెండ్ చేసిందని, తనను కాలేజ్ గేట్ బయట నిలబెట్టి అవమానించారని, ఇవన్నీ చూసి తట్టుకోలేక శ్రీహర్ష ఆత్మహత్య చేసుకున్నాడని అతని తండ్రి ఆరోపించారు. శ్రీహర్ష ఆత్మహత్యకు కారణం అయిన వారిని వెంటనే శిక్షించాలని కాలేజ్ విద్యార్థులు ఆందోళన చెయ్యడంతో పరప్పన అగ్రహార పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
మా తప్పు లేదు !
శ్రీహర్షను తాము సస్పెండ్ చెయ్యలేదని, ఆయన తండ్రిని తాము అవమానించలేదని అమృత విశ్వవిద్యాపీఠ ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యం స్పష్టం చేసింది. సెప్టెంబర్ 23వ తేదీ విద్యుత్ సరఫరా లేకపోవడం నీరు సరఫరా కాలేదని, హాస్టల్ పక్క బ్లాక్ లో నీరు అందుబాటులో ఉన్నా కాలేజ్ విద్యార్థులు తీసుకోలేదని, ధర్నా చేసి కాలేజ్ క్యాంటిన్, బస్సుల మీద రాళ్లు విసిరి ఆందోళన చేశారని కాలేజ్ యాజమాన్యం అంటోంది. ఒక్క రోజు నీరు రాకుంటే ఇంత హంగామా చేశారని, కాలేజ్ బయట శక్తులు విద్యార్థులను రెచ్చగొట్టి ఇంత పని చేశారని ఆరోపించింది.
ఎవరి తప్పుతో ఆత్మహత్య !
కాలేజ్ యాజమాన్యం తన తండ్రిని అవమానించి, ఉద్యోగంలో చేరడానికి కంపెనీ ఇచ్చిన అపాయింట్ లెటర్ చింపేశారని శ్రీహర్ష ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి. అయితే శ్రీహర్ష తండ్రిని అవమానించలేదని, అపాయింట్ మెంట్ లెటర్ చింపివేయలేదని కాలేజ్ యాజమాన్యం అంటోంది. 7 మంది క్రమశిక్షణ కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరిపించామని కాలేజ్ యాజమాన్యం అంటోంది. అయితే శ్రీహర్ష ఆత్మహత్య ఎవరు కారణం ? అనే విషయం అంతు చిక్కడం లేదు. శ్రీహర్ష ఆత్మహత్యకు ఎవరు కారణం ? అనే విషయం వెలుగు చూడాలంటే లోతుగా విచారణ చెయ్యాలని సాటి విద్యార్థులు, మృతుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.