జయలలిత కుమార్తె అమృత కేసులో ట్వీస్ట్: అపోలో ఆసుపత్రి వివరరణ, ఏం చెయ్యాలి!
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బ్లడ్ స్యాంపిల్స్ మా దగ్గర లేవని, బయోలాజికల్ పరీక్షలకు తాము ఎలాంటి స్యాంపిల్స్ తీసుకోలేదని చెన్నైలోని అపోలో ఆసుపత్రి యాజమాన్యం మద్రాసు హైకోర్టుకు నివేదిక ఇచ్చింది. తాను జయలలిత కుమార్తె, డీఎన్ఏ పరీక్షలు చేయించుకోవడానికి అపోలో ఆసుపత్రిలో ఉన్న జయలలిత బ్లడ్ స్యాంపిల్స్ ఇప్పించాలని బెంగళూరుకు చెందిన అమృత వేసిన పిటిషన్ విచారణ చేసిన మద్రాసు హైకోర్టు అపోలో ఆసుపత్రిని ప్రశ్నించడంతో గురువారం ఆసుపత్రి వర్గాలు కోర్టుకు వివరణ ఇచ్చారు. ఇప్పుడు అమృత ఏం చెయ్యాలి అంటూ అయోమయంలో పడిపోయారు.
ఆసుపత్రిలో చికిత్స
దాదాపు 75 రోజుల పాటు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందిన జయలలితకు ఎన్నిసార్లు రక్త పరీక్షలు నిర్వహించారు ? వాటిని భద్రపరిచారా ? అనే పూర్తి సమాచారం ఇవ్వాలని మద్రాసు హైకోర్టు అపోలో ఆసుపత్రికి ఆదేశాలు జారీ చేసింది. జయలలిత కుమార్తె తానే అంటూ బెంగళూరుకు చెందిన అమృత దాఖలు చేసిన పిటిషన్ విచారణ చేసిన మద్రాసు హైకోర్టు అపోలో ఆసుపత్రిని పై విధంగా ప్రశ్నించింది.
మైలాపూర్ లో అమ్మ ఇల్లు
చెన్నైలోని మైలాపూర్లో ఉన్న జయలలిత నివాసంలో తాను జన్మించానని, కొన్ని కారణాల వల్ల తనను జయలలిత బెంగళూరులో నివాసం ఉంటున్న సోదరి శైలజ కుమార్తెగా తనను ప్రపంచానికి పరిచయం చేశారని అమృత మద్రాసు హైకోర్టులో వేసిన పిటిషన్లో విచారణలో ఉంది.
బంధువులు చెప్పారు
జయలలిత మరణం తర్వాత తన సమీప బంధువులు లలిత, రంజనిల ద్వారా తనకు అసలు విషయం తెలిసిందని అమృత అంటున్నారు. తాను జయలలిత కుమార్తెను అని నిరూపించుకోవటానికి జయలలిత సమాధి నుంచి డీఎన్ఏ పరీక్షల కోసం నమూనాలు సేకరించమని తమిళనాడు ప్రభుత్వాన్ని, అధికారులను ఆదేశించాలని అమృత మద్రాసు హై కోర్టులో మనవి చేశారు.
జయ మేనకోడలు దీపా
బెంగళూరుకు చెందిన అమృత మా మేనత్త ఆస్తులు స్వాధీనం చేసుకోవడానికి ఆమె కూతురు అంటూ నాటకం ఆడుతుందని జయలలిత మేనకోడలు దీపా ఆరోపించారు. జయలలితకు వివాహం కాలేదని, ఆమెకు కుమార్తె లేదని దీపా అంటున్నారు. కోందురు కావాలనే అమృతను రెచ్చగొట్టి మా మేనత్త పరువు తియ్యడానికి ప్రయత్నిస్తున్నారని దీపా మండిపడుతున్నారు.
జయలలిత సోదరుడు
జయలలిత తండ్రి జయరామన్ మొదటి భార్య కుమారుడైన వాసుదేవన్ కర్ణాటకలోని మైసూరు జిల్లాలోని టీ. నరశీపురం తాలుకాలోని రంగరాజపురంలో నివాసం ఉంటున్నారు. జయలలిత సోదరుడైన వాసుదేవన్ అమృత జయలలిత కుమార్తె కాదని వాసుదేవన్ స్పష్టం చేశారు.
శైలజ కుమార్తె
జయలలిత సోదరి శైలజ కుమార్తె అమృత అని వాసుదేవన్ చెప్పారు. అయితే అమృత తాను జయలలిత కుమార్తె అంటూ ఎందుకు కోర్టుకు వెళ్లిందో మాకు ఎవ్వరికీ అర్థం కావడం లేదని వాసుదవన్ అన్నారు. జయలలిత మరణంపై చాలా అనుమానాలు ఉన్నాయని, సీబీఐతో దర్యాప్తు చేయించాలని తాను ఇప్పటికే కేంద్ర హోం శాఖ కార్యాలయానికి లేఖ రాశానని వాసుదేవన్ వివరించారు.
అయోమయంలో అమృత
అపోలో ఆసుపత్రి వివరణతో జయలలిత కుమార్తె తానే అంటున్న బెంగళూరు అమృత అయోమయంలో పడిపోయారు. ఇప్పుడు జయలలిత కుమార్తెను అని చట్టపరంగా నిరూపించుకోవడానికి ఎలా ముందుకు వెళ్లాలి అని ఆమె న్యాయవాదులతో చర్చిస్తున్నారు.