ప్రీతి కేసులో మరో ట్విస్ట్: లైంగిక వేధింపులు కాదట!
ముంబై: ప్రముఖ పారిశ్రామికవేత్త నెస్ వాడియాపై ప్రముఖ బాలీవుడ్ నటి, ఇండియన్ ప్రీమియర్ లీగ్ జట్టయిన కింగ్స్ లెవన్ పంజాబ్ సహ యజమాని ప్రీతి జింతా లైంగిక వేధింపుల ఆరోపణలు చేయలేదని ఆమె తరపు న్యాయవాది హితేష్ జైన్ పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశంలో ప్రీతి జింతాపై నెస్ వాడియా అసభ్య పదజాలం ఉపయోగించి అవమానపర్చాడని ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు.
ప్రీతి జింతా తన ఫిర్యాదులో లైంగికంగా వేధించాడనే ఆరోపణలు ఎక్కవ చేయలేదని, బహిరంగంగా అసభ్యకరంగా దూషించారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారని న్యాయవాది హితేష్ తెలిపారు. బహిరంగ ప్రదేశంలో అసభ్య పదజాలంతో దూషించడం కారణంగానే అవమానంగా భావించిన ప్రీతి జింతా ముంబైలోని మెరైన్ పోలీస్ స్టేషన్లో పిటిషన్ దాఖలు చేశారని తెలిపారు.
ఆమె ఫిర్యాదు మేరకు నెస్ వాడియాపై ఐపిసి 354 సెక్షన్ కింద కేసు నమోదు చేశారని చెప్పారు. ఆ సెక్షన్ కింద నమోదైన కేసు లైంగిక వేధింపుల కిందకు రాదని న్యాయవాది హితేష్ జైన్ పేర్కొన్నారు.
కాగా, అసలు విషయం ఏంటంటే.. ఐపిఎల్-7లో ఓ పంజాబ్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో కుటుంబ సభ్యులతో వచ్చిన నెస్ వాడియా.. ప్రీతి జింతా, ఆమె స్నేహితులు, క్రికెటర్ల కుటుంబ సభ్యులు కూర్చున్న సీట్లను ఖాళీ చేయాలని ఆమెను కోరాడు. అయితే అప్పటికే ప్రీతి జింతా తన స్నేహితులతో కూర్చుని ఉండటంతో అందుకు నిరాకరించింది. దీంతో సహనం కోల్పోయిన వాడియాపై ప్రీతిపై పరుష పదజాలంతో దూషించినట్లు తెలిసింది. ఈ విషయాన్ని కన్నీరుపెట్టుకుంటూ ఐపిఎల్ ఛైర్మన్ రంజిబ్ బిస్వాల్కు ప్రీతి వివరించినట్లు తెలిసింది.