ప్రధాని మోదీని టార్గెట్ చేసిన హ్యాకర్స్... వెబ్సైట్ ట్విట్టర్ ఖాతా హ్యాక్...
ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగత వెబ్సైట్(narendramodi.in)కి సంబంధించిన ట్విట్టర్ అకౌంట్ గురువారం(సెప్టెంబర్ 3) హ్యాక్కి గురైంది. 2.5 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్న ఈ ట్విట్టర్ హ్యాండిల్ తెల్లవారుజామున 3.15గం. సమయంలో హ్యాక్ అయినట్లు గుర్తించారు. హ్యాక్ తర్వాత కుప్పలు తెప్పలుగా పలు ఫేక్ ట్వీట్స్ ఇందులో దర్శనమిచ్చాయి. ఆ తర్వాత సాంకేతిక నిపుణుల సహాయంతో వాటిని తొలగించారు.
Recommended Video
ఫేక్ ట్వీట్స్..
'కోవిడ్ 19పై పోరు కోసం పీఎం రిలీఫ్ ఫండ్కు భారీగా విరాళాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు భారత్లో క్రిప్టో కరెన్సీ(డిజిటల్ లావాదేవీలు) మొదలవుతుంది. దయచేసి 0xae073DB1e5752faFF169B1ede7E8E94bF7f80Be6 దీనికి బిట్ కాయిన్ విరాళాలు ఇవ్వండి.' అని హ్యాక్ అనంతరం ఓ ఫేక్ ట్వీట్ ఆ ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేయబడింది. మరో ఫేక్ ట్వీట్లో 'అవును ఈ ట్విట్టర్ అకౌంట్ జాన్ విక్(([email protected]) చేత హ్యాక్ చేయబడింది. అయితే పేటీఎం మాల్ను మేము హ్యాక్ చేయలేదు.' అని పేర్కొన్నారు. మోదీ ట్విట్టర్ ఖాతా హ్యాక్పై ట్విట్టర్ ప్రతినిధులు స్పందించారు. పరిస్థితిని తాము చురుగ్గా పరిశీలిస్తున్నామని... అయితే మరిన్ని ఖాతాలు దీనికి ప్రభావితమవుతాయా అన్నది ఇప్పుడే చెప్పలేమని అన్నారు.
జులైలో ప్రముఖుల వెబ్సైట్స్ హ్యాక్...
ఈ ఏడాది అగస్టు 30న ఇదే జాన్ విక్ హ్యాకర్ గ్రూప్ పేటీఎం మాల్కు సంబంధించి భారీ ఎత్తున డేటా చోరీకి పాల్పడినట్లు సిబిల్ వెల్లడించింది. అంతేకాదు, హ్యాక్ నుంచి విముక్తి కావాలంటే పేటీఎం యాజమాన్యం డబ్బులు చెల్లించాల్సిందేనని డిమాండ్ చేసినట్లు తెలిపింది. మరోవైపు పేటీఎం మాత్రం తమ విచారణలో డేటా చోరీ ఏమీ జరగలేదని తేలినట్లు వెల్లడించింది. ఈ ఏడాది జులైలో ప్రముఖులు వారెన్ బఫెట్,జెఫ్ బెజోస్,బరాక్ ఒబామా,జో బిడెన్,బిల్ గేట్స్ ట్విట్టర్ ఖాతాల్లోనూ క్రిప్టో కరెన్సీకి సంబంధించిన పోస్టులు దర్శనమిచ్చాయి. కార్పోరేట్ కంపెనీలైన ఉబర్,యాపిల్ సంస్థల ట్విట్టర్ ఖాతాలు కూడా దీని బారినపడ్డాయి. వెయ్యి డాలర్లు చెల్లిస్తే మీ చిరునామాకు 2వేల డాలర్లు పంపిస్తామన్న ఫేక్ ట్వీట్లు ఆ ఖాతాల్లో దర్శనమిచ్చాయి.
గతంలోనే ట్విట్టర్ను వివరణ కోరిన భారత్...
ఈ పరిణామాల నేపథ్యంలో ఈ ఏడాది జులైలో ఇండియా సైబర్ సెక్యూరిటీ నోడల్ ఏజెన్సీ ట్విట్టర్ యాజమాన్యాన్ని వివరణ కోరుతూ నోటీసులు కూడా ఇచ్చింది. హైప్రొఫైల్ అకౌంట్స్ను హ్యాకర్లు టార్గెట్ చేయడంపై పూర్తి వివరాలు అందించాలని కోరింది. హ్యాకింగ్ బారినపడకుండా ట్విట్టర్ తీసుకుంటున్న చర్యలను వెల్లడించాలని కోరింది. కాగా,ఇటీవలే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యక్తిగత వెబ్సైట్ కూడా హ్యాక్కి గురైన సంగతి తెలిసిందే. పాకిస్తాన్కి చెందిన హ్యాకర్లే ఈ పని చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.