కేంద్రం దెబ్బకు దిగొచ్చిన ట్విటర్ -97 శాతం ఖాతాలు, పోస్టులపై చర్యలు
వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న ఆందోళనలను తప్పుదోవ పట్టించేలా, ఉద్యమంలో హింసను ప్రేరేపించేలా వ్యవహరించిన ట్విటర్ హ్యాండిల్స్ పై చర్యల విషయంలో ట్విటర్ సంస్థ ఎట్టకేలకు దిగొచ్చింది. వివాదాస్పద ట్విటర్ ఖాతాలు, పోస్టులపై ప్రభుత్వం ఫిర్యాదు చేసిన తర్వాత కూడా చర్యలు తీసుకోకపోవడాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించింది. ఈ అంశంపై పార్లమెంట్, సుప్రీంకోర్టుల్లో సైతం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.
రైతు ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించేలా ఉన్న ఖాతాలను కట్టడి చేయాలన్న కేంద్రం ఆదేశాలను ట్విటర్ పాటించినట్లు తెలుస్తోంది. కేంద్రం ఫిర్యాదు చేసిన వాటిలో 97 శాతం ఖాతాలు, పోస్టులను బ్లాక్ చేసినట్లు సంబంధిత వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. రైతుల ఉద్యమానికి సంబంధించి కేంద్రం ప్రభుత్వం, ట్విటర్కు మధ్య విభేదాలు నెలకొన్న క్రమంలో చివరికి ట్విటర్ దిగిరాక తప్పలేదు.
వివాదాస్పద ఖాతాలు, పోస్టులపై చర్యల విషయంలో బుధవారం రోజున కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి, ట్విటర్ ప్రతినిధుల మధ్య సమావేశం జరిగింది. స్థానిక చట్టాలను పాటించాలని లేకపోతే కఠిన చర్యలకు సిద్ధంగా ఉండాలని సంస్థ ప్రతినిధులకు కేంద్రం గట్టి హెచ్చరికలు పంపింది. అంతేకాకుండా భారత చట్టాలను పాటించాల్సిందేనని గురువారం ఐటీ శాఖ మంత్రి పార్లమెంట్ వేదికగా స్పష్టం చేశారు. దీంతో..
అయ్యో యశస్విని.. చదువు కొనలేక తనువు చాలించింది -ఫీజు వేధింపులకు పేద విద్యార్థిని బలి
చర్యల విషయంలో ఇప్పటిదాకా బెట్టుగా వ్యవహరించిన ట్విటర్.. ఎట్టకేలకు కేంద్రం ఆదేశాలను పాటించిందని, 97 శాతం ఖాతాలను, పోస్టులను బ్లాక్ చేసిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ వార్తలపై ట్విటర్, కేంద్ర ప్రభుత్వాలు అధికారికంగా స్పందించాల్సి ఉంది. నిజానికి..
రైతుల ఉద్యమాన్ని పక్కదారి పట్టించేలా ట్వీట్లు చేసిన 1,178 ఖాతాలపై చర్యలు తీసుకోవాలని కొద్ది రోజులు క్రితం కేంద్రం ఆదేశాలు జారీచేసింది. భావ ప్రకటన స్వేచ్ఛకు తాము ప్రాధాన్యం ఇస్తామంటూ ట్విటర్ వాటిలో కొన్నింటిపైనే చర్య తీసుకుంది. ఆ వ్యవహారంలో కేంద్రం తీవ్ర ఆగ్రహానికి గురైన సంగతి తెలిసిందే.